byసూర్య | Wed, Oct 14, 2020, 04:29 PM
నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రాజేంద్రనగర్ డివిజన్ పల్లె చెరువులో పరిస్థితిని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ పల్లె చెరువు కట్టతెగి నీరు భారీగా ప్రవహిస్తోందన్నారు. ఈ చెరువు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తే లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లల్లోకి నీరు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. దీంతో పోలీస్ యంత్రాంగాన్ని, ఆక్టోపస్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశామన్నారు. ఇప్పుడు కొంచెం వరద ఉధృతి తగ్గిందన్నారు. గురువారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ బయటకు రావద్దన్నారు. మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ, జిల్లా యంత్రాంగం కొన్ని ఫంక్షన్ హాళ్లను ఏర్పాటు చేసిందని, బాధితులు అక్కడకు వెళ్లాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.