byసూర్య | Tue, Mar 31, 2020, 12:17 PM
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు ఉన్న పేదలకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో 1.09 కోట్ల కుటుంబాలు ఉండగా 87.59 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరిలో ఒక్కో లబ్దిదారుడికీ 12 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దాంతో... బియ్యాన్ని క్షేత్రస్థాయికి తరలించేందుకు అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. మొత్తం 3.36 లక్షల టన్నుల బియ్యంలో చాలా వరకూ తరలించారు. ఈ రేషన్ బియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.1,103 కోట్ల ఆర్థిక భారం పడుతోంది. నిత్యవసర సరుకులు కొనుక్కునేందుకు ప్రతి రేషన్ కార్డు దారుకూ రూ.1,500 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం కూడా మొదలైంది. ఈ నిధుల పంపిణీకి ఈ-కుబేర్ సాఫ్ట్వేర్ను వాడుతున్నారు. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య ప్రస్తుతం 70 దాటింది. తాజాగా ఢిల్లీకి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారిలో కొంత మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడం, కొత్తగా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో అప్రమత్తమైన ప్రభుత్వం... ఢిల్లీ నుంచి ఎవరెవరు తెలంగాణకు వచ్చారో తెలుసుకుంటూ... వారందర్నీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించే పనిలో నిమగ్నమైంది. తెలంగాణలో రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనే ప్రక్రియ కూడా మొదలైంది. ఇందుకు సంబంధించి వరిని కోత కోసే యంత్రాలు సిద్ధమవగా... కావాల్సిన కార్మికులను బీహార్ నుంచి తెప్పిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ వేగం పుంజుకోనుంది.