byసూర్య | Sun, Mar 29, 2020, 12:09 PM
భారత్ను కరోనా వణికిస్తుంది. ఇప్పుడిప్పుడే కోరలు చాస్తోంది. కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖాలకు మాస్క్లు ధరిస్తున్నారు. శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకుంటున్నారు. బయటకు వెళ్లినప్పుడు పక్కవారికి దూరంగా జరుగుతూ సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటిస్తున్నారు. ఐతే వీటితో పాటు మరో జాగ్రత్త కూడా పాటించాల్సిన అవసరం ఉంది. కరెన్సీ నోట్లతో జాగ్రత పడాలని ఎస్బీఐ సూచిస్తోంది. అన్నింటి కంటే కరెన్సీ నోట్లతోనే వైరస్ వేగంగా వ్యాపించే అవకాశాలున్నాయని ఎస్బీఐ చేసిన పరిశోధనలో తేలింది. మనదేశంలో ప్రస్తుతం ప్రత్యేకమైన కాగితంతో తయారైన కరెన్సీ నోట్లనే వినియోగిస్తున్నాం. ఐతే వీటితో వైరస్ సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎస్బీఐ రీసెర్చ్ బృందం తెలిపింది. కరెన్సీ నోట్లపై మనుషులకు ఇన్ఫెక్షన్లు కలిగించే సూక్ష్మక్రిములు ఉంటున్నాయని, వాటి ద్వారా పలు వ్యాధులు సంక్రమిస్తున్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో కెనాడా, బ్రిటన్, ఆస్ట్రేలియా తరహాలోనే పాలిమర్స్ నోట్లను తీసుకొచ్చే అవకాశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం మనదేశంలో వైరస్ వేగంగా వ్యాపిస్తోందని.. దాన్ని నియంత్రించాలంటే నోట్ల విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పూర్తిగా క్యాష్లెస్ (నగదు రహిత) ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇంకా మంచిదని తెలిపింది. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే మనదేశంలో పూర్తిగా క్యాష్ లెష్ చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని.. కరెన్సీ విషయంలో ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.