byసూర్య | Sat, Oct 12, 2019, 12:43 AM
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో అధికార పార్టీ భారీ వ్యతిరేకత మూటగట్టుకున్నట్టే కనిపిస్తోంది. మండలానికో నాయకుడు ఇన్ చార్జిగా ఏర్పాటు చేసి, మంత్రులు శాసనసభ్యులు కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేస్తున్నా అనుకూల ఫలితం వస్తుందన్న నమ్మకం లేదన్నది ఆ పార్టీ వర్గాలే చెపుతున్న మాట.
రాజకీయ అంశాల కన్నా, అధికార, విపక్షాల విమర్శల కన్నా ఆర్టీసీ సమ్మె ప్రభావం తీవ్రంగా ఈ ఎన్నికలలో కనిపించడం ఖాయమన్నది విశ్లేషకుల అంచనా . కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తూ వారి హక్కులను కాలరాస్తున్నదనే అభిప్రాయం నియోజకవర్గంలో చాలా మంది ఓటర్లలో వినిపిస్తున్నా మాట. దీనికి తోడుగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుండటం, సమైక్య ఆంధ్రలో ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి కేసీఆర్ అన్న మాటల వీడియో ఇక్కడ విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు.
హుజూర్ నగర్ లో శుక్రవారం ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన బిక్షాటన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. మరోవైపు రెవెన్యూ సిబ్బంది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే హుజూర్ నగర్ నియోజకవర్గంలో చాపకింద నీరులాగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రచార బరిలో ఉన్న టిఆర్ఎస్ నాయకులకు ఎక్కడా వ్యతిరేకత ఎదురు కావడం లేదని, దీంతో సమ్మెపై ప్రజలు స్పందించడంలేదని అధికార వర్గాలు చెపుతుంటే... జనంలో గూడుకట్టుకున్న వ్యతిరేకత ఉప్పెనలా రానుందని, ఇక్కడి సెటిలర్లు కూడా ఈ సారి కాంగ్రెస్ వైపు తిరుగేలా ఉండటంతో తమ గెలుపు తధ్యమన్న ధీమా ఆ పార్టీ నేతలలో కనిపిస్తోంది.
టిఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి సెటిలర్ అనే ముద్ర ఉన్నందున సెటిలర్ల ఓట్లు ఆయనకు ఎక్కువగా వెళతాయని ఆలోచించి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిని దించడంతో సైది రెడ్డి వారి ఓట్లు కోల్పోవటం తధ్యమన్న మాట వినిపిస్తోంది. అయితే సైదిరెడ్డిని గెలిపించుకు తీసుకురావాలంటూ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసీఆర్ ఆదేశాలివ్వటంతో మరింత ఎక్కువగా శ్రమతో పాటుతాయిలాలు భారీగా ఉంటే తప్ప హుజూర్ నగర్ లో గెలవటం అసాధ్యమేనని టిఆర్ ఎస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరేం జరగనుందో చూడాలి.