byసూర్య | Mon, Jun 24, 2019, 09:31 PM
బీజేపీలో చేరితే భవిష్యత్తులో తానే సీఎం అవుతానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్తతో ఆయన మాట్లాడినట్లుగా భావిస్తోన్న ఆడియో ఒకటి తాజాగా ప్రకంపనలు రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, స్వయంగా రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు ఆ ఆడియో ద్వారా తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఈ నెల 28న ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున భువనగిరి ఎంపీగా గెలిచారు. అయితే తాను మాత్రం కడదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని వెంకటరెడ్డి చెబుతుండగా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం బీజేపీవైపే అడుగులు వేస్తున్నారు.