ఎండల ఎఫెక్ట్ : తెలంగాణలో బీర్లు తెగ తాగేశారు
byసూర్య |
Mon, Jun 17, 2019, 07:02 PM
ఎన్నడూ లేని విధంగా ఈసారి వేసవి కాలంలో ఎండలు మండిపోయాయి. సూర్యుడు నిప్పులు కురిపించాడు. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ సమ్మర్ లో రికార్డ్ స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యాయి. ఓవైపు ఉక్కపోత మరోవైపు దాహం.. జనాలు విలవిలలాడారు. చల్లదనం కోసం బీర్లని ఆశ్రయించారు. బీరుని తెగ తాగేశారు. దీంతో ఈ సమ్మర్ లో తెలంగాణలో రికార్డ్ స్థాయిలో బీర్ల అమ్మకాలు జరిగాయి.
రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ లెక్కల ప్రకారం.. మే నెలలో 61లక్షల బీరు కేసులు అమ్ముడుపోయాయి. ఈ రేంజ్ లో సేల్స్ జరగడం ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నారు అధికారులు. ఏప్రిల్ లో 53లక్షల కేసులు అమ్ముడు పోయాయని చెప్పారు. ఎండలు బీర్ల సరఫరాపైనా ప్రభావం చూపాయి. నీళ్లు లేకపోవడంతో ప్రొడక్షన్ తగ్గింది. డిమాండ్ కు తగ్గట్టుగా సప్లయ్ చేయలేకపోయారు. మెదక్ లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బీర్ల తయారీకి ఇబ్బందులు తలెత్తాయని బీర్ల తయారీ కంపెనీలు చెప్పాయి.
తీవ్రమైన నీటి సమస్య ఉండటంతో.. బీర్ల తయారీ కంపెనీలకు నీటి సరఫరా నిలిపివేయాలని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు. దీంతో 30శాతం వరకు నీటి సరఫరా తగ్గిపోయింది. ప్రీమియం రేంజ్ బీర్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కొన్ని పాపులర్ బ్రాండ్స్ బీర్ల విషయంలో మాత్రం కొరత ఏర్పడిందని అధికారులు చెప్పారు. బీర్ల కొరత అనేది వేసవి సీజన్ లో కామన్ అని అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితి తెలంగాణలో మాత్రమే కాదు.. దేశం మొత్తం ఉంటుందన్నారు. సేల్స్ పెరగడం పట్ల బీరు తయారీ కంపెనీలు ఆనందంగా ఉన్నాయి. ఈసారి మంచి లాభాలు వచ్చాయని మురిసిపోతున్నారు. అటు ప్రభుత్వ ఖజానాకి కూడా భారీగానే ఆదాయం లభించింది.
Latest News