byసూర్య | Mon, Jun 17, 2019, 03:04 PM
అనంతగిరి అడవుల్లో జంట మృతదేహాలు కలకలం సృష్టించాయి. ఇద్దరు వృద్ధ దంపతుల హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సతీష్, రాహుల్ అనే ఇద్దరు యువకులు ఈ హత్యలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కర్ణాటకలోని హుస్నాబాద్ ప్రాంతం కారులో ఇద్దరిని హత్య చేసి..అనంతగిరి కొండల ప్రాంతంలో పడవేసి పరారైనట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. మృతులిద్దరు హైదరాబాద్ లోని BHEL కు చెందిన దంపతులు నవరత్నరెడ్డి(80), స్నేహలతారెడ్డి(75)లుగా గుర్తించారు.
కాగా వీరిద్దరు బుధవారం (జూన్ 12) నుంచి కనిపించటంలేదంటు బంధువులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ముందుగా డ్రైవర్ సతీష్ ను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నేరం అంగీకరించాడు.
దంపతులను కారులో హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్తుండగా మరో యువకుడు రాహుల్ తో కలిసి వీరిద్దరినీ హత్య చేసి..మృతదేహాలను పెట్రోల్ పోసి తగులబెట్టినట్లుగా అంగీకరించాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయాననీ..అప్పు తీర్చేందుకు వేరే దారిలేక..వీరి వద్ద డబ్బులు, నగలు కాజేయాలనే ఉద్ధేశ్యంతో ఈ దారుణానికి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. దీంతో సతీష్, రాహుల్ ను అరెస్ట్ చేసారు పోలీసులు.