byసూర్య | Sat, Jan 19, 2019, 06:56 PM
తొమ్మిది పదుల వయస్సులో నేను సైతం అంటూ ఓ వృద్ద మహిళ ఎన్నికల బరిలో ఉండటం ఇక్కడ అందరినీ అశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో అనేక పర్యాయాలు పలు పదవులను చేపట్టిన ఆ మహిళ మరో సారి ఎన్నికల్లో పోటీలో దిగింది. యువతీ యువకులకు సమానంగా ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లి గ్రామ పంచాయితీ ఎన్నికలు ఆసక్తిగొల్పుతున్నాయి. 90 ఏళ్ల వయసున్న ఓ మహిళ సర్పంచ్ పదవికి పోటీలో ఉండడం అందరినీ అచ్చెరువొందేలా చేస్తుంది. గతంలో రెండు పర్యాయాలు సర్పంచ్ గా ఒక పర్యాయం జెడ్పీటీసీ సభ్యురాలుగా రత్తమ్మ పని చేశారు.
తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఈడా రత్తమ్మ 90 ఏళ్ళ వయస్సులోను మరోసారి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈమె భర్త ఈడా చెన్నయ్య... ఉమ్మడి ఏపీ మాజీ సీఎం జలగం వెంగళరావు, హయగ్రీవా చారి లాంటి వారితో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన పటేల్ పోలీస్గానూ పనిచేశారు. రెండుసార్లు సర్పంచ్ పదవి చేపట్టారు. ఆయన బాటలోనే సతీమణి ఈడా రత్తమ్మ తుమ్మలపల్లి గ్రామం నుంచి మూడుసార్లు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. రెండు సార్లు విజయం సాధించారు. ఒకసారి ఓడిపోయారు. పెనుబల్లి మండలం ఏర్పడిన తరువాత మొట్టమొదటి జడ్పీటీసీ సభ్యురాలుగా రత్తమ్మ సేవలు అందించారు.
తుమ్మలపల్లి గ్రామ అభివృద్ధి నా లక్ష్యం. నా భర్త ఎలా అభివృద్ధి చేశారో అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తా. మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని వారి సమస్యలను తీరుస్తా. ప్రాణం పోయేవరకు ప్రజా శేయస్సు కోసం పనిచేస్తానంటున్నారు రత్తమ్మ.