byసూర్య | Fri, Jan 18, 2019, 11:44 AM
వచ్చే లోక్ సభ ఎన్నికల లోపలే అయోద్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభించాలని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ తదితర హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వెనక్కి తగ్గింది. రామ మందిర నిర్మాణం ఆలస్యం అవుతున్న కొద్దీ బీజేపీ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆర్ ఎస్ ఎస్ ఇప్పుడు 2025 లో మందిర నిర్మాణం జరుగుతుందంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నకుంభమేళాలో పాల్గొన్న ఆర్ ఎస్ ఎస్ నెంబర్ 2 భయ్యాజీ జోషీ మాట్లాడుతూ 2025 లో రామ మందిరం నిర్మించిన తరువాత దేశాభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. 1952 లో గుజరాతులో సోమనాథ ఆలయం నిర్మించిన తరువాతే దేశం అభివృద్ధి చెందిందని, రామ మందిరం విషయంలోనూ ఇదే జరుగుతుందని అన్నారు. రామ మందిరం విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురు చూడాల్సిందేనని ప్రధాని మోడీ ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన నేపథ్యంలో భయ్యాజీ జోషీ ఈ వ్యాఖ్యలు చేశారు.