byసూర్య | Sat, Oct 26, 2024, 07:19 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొడంగల్లో కాంగ్రెస్ నుంచి పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కొడంగల్ మండల కాంగ్రెస్ మాజీ ఎంపీపీ దయాకర్ రెడ్డి, బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ నర్మద, పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... సీఎం సొంత నియోజకవర్గంలో ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మా సిటీని తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం అధికారంలోకి వచ్చాక కొడంగల్లోనే ఫార్మా కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయడంతో స్థానిక ప్రజలు తరిమికొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని తక్కువ ఖర్చుతో సస్యశ్యామలం చేసే ప్రణాళికలు పక్కనపెట్టి, కేవలం కమిషన్ల కోసం కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టారన్నారు.మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని విమర్శించిన మెగా ఇంజనీరింగ్ కంపెనీకి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనక ఉన్న మతలబు ఏమిటో చెప్పాలన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అనేక వర్గాల ధర్నాలు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టుడుకుతోందన్నారు. కానీ మంత్రులు మాత్రం విహారయాత్రలో ఉన్నారని విమర్శించారు. అయినా ఇలాంటి చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందన్నారు.బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆదాయం క్రమంగా తగ్గుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్ ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఉపయోగిస్తున్నారని, ఇది అధికార దుర్వినియోగమే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు.