byసూర్య | Sat, Oct 26, 2024, 07:13 PM
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో.. ప్రధాన అంశాలపై మంత్రివర్గం చర్చించగా.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ములుగులో గిరిజన యూనివర్సిటీకి ఎకరా రూ.250 చొప్పున భూమి కేటాయింపు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇవే కాకుండా.. మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసేందుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధిని పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు.. ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీతో పాటు.. రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఒకటైన సన్న వడ్లకు రూ.500 బోనస్కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి.. మరో రెండు నెలల్లో ఏడాది పూర్తి చేసుకుంటున్న క్రమంలో.. నిర్వహించిన కేబినెట్ భేటీపై సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా.. ఈ మంత్రివర్గ సమావేశంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో, ఇచ్చిన హామీలపై కూడా చర్చించినట్టు సమాచారం. ఇప్పటివరకు ఎన్ని హామీలు నెరవేర్చాం.. ఇంకా ఎలాంటి హామీలు నెరవేర్చాల్సి ఉంది అన్న అంశంపై కేబినెట్ ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. మరోవైపు.. పలు హామీలను నెరవేర్చేందుకు గానూ ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీలు సమర్పించిన నివేదికలపై మంత్రివర్గం చర్చించింది.
ఇదిలా ఉంటే.. రైతు రుణమాఫీ, రైతుభరోసా అమలుపై కూడా మంత్రి వర్గంలో చర్చించినట్టు తెలుస్తోంది. పలు సాంకేతిక కారణాలతో ఆగిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైరు.. రైతుభరోసాపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ.. పలు కీలక విషయాలను పంచుకుంది. అయితే.. విధివిధాలను ఖరారు చేసేందుకు మరింత సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది.