బండి సంజయ్ పరీక్షా రాసేది లేదు, అర్థంకాదు: కేటీఆర్

byసూర్య | Sat, Oct 19, 2024, 07:03 PM

గ్రూప్ 1 అభ్యర్థులు అలుపెరగకుండా ఆందోళ చేస్తుంటే, ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడం సరికాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. గ్రూప్ -1 అభ్యర్థులు 10 మందిని సచివాలయానికి పిలిపించి మాట్లాడొచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడితే అభ్యర్థుల సమస్యకు పరిష్కారం దొరకదని కేటీఆర్ అన్నారు. ‘బండి సంజయ్ గ్రూప్ 1 పరీక్ష రాసేది లేదు. ఆయనకు చెప్పినా అర్థం కాదు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను సచివాలయానికి పిలిచి మాట్లాడండి’ అని కేటీఆర్ సెటైర్లు వేశారు. గ్రూప్ 1 పరీక్షను ఓ నెలో, రెండు నెలలో వాయిదా వేస్తే కొంపలేం అంటుకుపోవని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనపై హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో శనివారం (అక్టోబర్ 19) మధ్యాహ్నం కేటీఆర్ మాట్లాడారు.


గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనను పక్కదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కొత్త నాటకానికి తెర తీశారని కేటీఆర్ విమర్శించారు. ‘కాంగ్రెస్‌లో తోటి నాయకులు గోతి కాడ నక్కల్లా కాచుకొని ఉన్నారు. రేవంత్ రెడ్డీ జాగ్రత్త అంటూ నిన్న ఆయనకు సూచనలు చెప్తారు బండి సంజయ్. ఇవాళ అశోక్ నగర్‌కు వచ్చి ఆందోళన చేస్తారు. అదే నేను అశోక్ నగర్ వెళ్లడానికి ప్రయత్నిస్తే.. పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. బండి సంజయ్‌ని మాత్రం సీఆర్‌పీఎఫ్ బలగాలను పెట్టి వాళ్లే పంపించారు’ అని కేటీఆర్ ఆరోపించారు.


ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్ నగర్‌కు వచ్చి గ్రూప్ 1 అభ్యర్థులకు సాధ్యంకాని హామీలు ఇచ్చి రెచ్చగొట్టారని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పద్ధతిలో విద్యార్థులతో ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అణచివేత కనిపించడంలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.


తనను అశోక్ నగర్ వెళ్లకుండా అడ్డుకున్నందుకే గ్రూప్ 1 అభ్యర్థులు తమ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు వచ్చి కలిశారని, వారి సమస్యలను చెప్పుకున్నారని కేటీఆర్ తెలిపారు. జీవో 29 కారణంగా నష్టపోతామని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని, ఇంకా వారికి అనేక ఆందోళనలు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకైనా ఆగితే బాగుండేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా తమ పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్, శ్రీనివాస్ గౌడ్ సుప్రీంకోర్టుకు వెళ్లారని కేటీఆర్ తెలిపారు.


కేంద్ర మంత్రి బండి సంజయ్.. శనివారం ఉదయం అశోక్ నగర్‌కు వచ్చారు. బండి సంజయ్ వచ్చిన విషయం తెలిసి గ్రూప్ 1 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అనంతరం బండి సంజయ్.. తెలంగాణ సచివాలయం వద్దకు ర్యాలీకి పిలుపునిచ్చారు. గ్రూప్ 1 అభ్యర్థులు, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో సచివాలయం వద్దకు చేరుకున్నారు. అటు బీఆర్‌ఎస్ నేతలు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్, శ్రీనివాస్ గౌడ్, ముఠా జయసింహ సైతం గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా సచివాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద బండి సంజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బీఆర్‌ఎస్ నేతలను అరెస్టు చేసి బండ్లగూడ వైపు తీసుకెళ్లారు. సచివాలయం ఎదుట భైఠాయించిన ఆందోళనకారులను చెదరగొట్టి పోలీసు వాహనాల్లో ఎక్కించి తరలించారు.


Latest News
 

మియాపూర్‌లో సంచరించింది అడవిపిల్లిగా తేల్చిన అధికారులు Sat, Oct 19, 2024, 08:57 PM
మంత్రి సీతక్కను కలిసిన ములుగు గ్రంథాలయ ఛైర్మన్ Sat, Oct 19, 2024, 08:49 PM
పోలీసు అమరుల త్యాగాలను మరువద్దు: వరంగల్ కమిషనర్ Sat, Oct 19, 2024, 08:48 PM
గ్రంథాలయ ఛైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు Sat, Oct 19, 2024, 08:48 PM
సీఎం రేవంత్ ను కలిసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 08:46 PM