గ్రూప్ 1 పరీక్షలు యథాతథం.. హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు

byసూర్య | Fri, Oct 18, 2024, 08:54 PM

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 21వ తేదీ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు వేసిన పిటిషన్లను ఇప్పటికే సింగిల్ బెంచ్ కొట్టివేయగా.. వారు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో యథావిధిగా సోమవారం నుంచి తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.


గ్రూప్‌ 1 పరీక్షల నిర్వహణకు సంబంధించి.. ఈనెల 15వ తేదీన తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పు వచ్చిన రెండు రోజుల తర్వాత అభ్యర్థులు మళ్లీ కోర్టు మెట్లెక్కారు. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ముగ్గురు అభ్యర్థులు డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. తాజాగా సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్.. పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపింది. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్షలకు మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్‌ 9వ తేదీన నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు.


మరోవైపు.. గ్రూప్ 1 అభ్యర్థులు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జీవో 29ను రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. జీవో 29 వల్ల జరిగే నష్టాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు.. తమ లాయర్ వివరించినట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. అయితే అక్టోబర్ 21వ తేదీన మొదటి కేసుగా తీసుకొని విచారిస్తామని సుప్రీంకోర్టు వాయిదా వేసినట్లు తెలిపారు. జీవో 55నే అమలు చేయాలని కోరినా.. సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే లోపే జీవో 29ను రద్దు చేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.



Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM