byసూర్య | Thu, Oct 17, 2024, 03:44 PM
రైతును రాజు చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను చేపట్టిందని ప్రభుత్వం సన్న రకం ధాన్యాన్ని ప్రోత్సహించేందుకుగాను రూ.500 బోనస్ చెల్లిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్ రాజనర్సింహా అన్నారు. బుధవారం చౌటకూరు మండలం శివ్వంపేట గ్రామంలోని సొసైటీ కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో 211 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, జిల్లా వ్యాప్తంగా పదివేల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యంను కేంద్రాల ద్వారా వస్తుందని ప్రభుత్వం భావిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సన్నరకం పండించే రైతులకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు తీసుకువచ్చిన ధాన్యంను కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలని అందుకు అధికారులదే భాద్యతయన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి తీసుకువస్తారన్నారు. రైతుల అభివృద్ది విషయంలో ప్రభుత్వం ఎలాంటి వెనకడుగు వేయకుండా అన్ని రకాలుగా సహకరిస్తుందని మంత్రి అన్నారు. కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం మేచర్ను మంత్రి దామోదర్ స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా మేచర్ ఉన్న ధాన్యంను తీసుకువచ్చి విక్రయించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటైన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తాము పండించిన ధాన్యంను తీసుకువచ్చి విక్రయించాలని మంత్రి కోరారు. . ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కామన్ వెరైటీ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,300, సూపర్ ఫైన్ వెరైటీకి క్వింటాలుకు రూ. 2,320 రూపాయలు చెల్లించనున్నట్లు తెలిపారు. దాన్యమును వెంటనే అన్లోడింగ్ చేసేలా అవసరమైన ఆమాలీలను నియమించుకోవాలని మిల్లర్లకు సూచించారు. ట్రాన్సో్పర్ట్ సమస్యలు తలెత్తకుండా అన్ని కేంద్రాలలో తగిన ఏర్పాట్లు చేయాలని తేమ చూసే మిషన్ కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని గోనె సంచులు అమల్లో కొరత లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్బంగా శివ్వంపేట సొసైటీ డైరెక్టర్లను మంత్రి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్,జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అడిషనల్ కలెక్టర్ మాధురీ, ట్రైనీ కలెక్టర్ డీసీఓ కిరణ్కుమార్, ఆర్డీఓ పాండు, మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మొహన్రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పల్లె సంజీవయ్య, మండల కాంగ్రేస్ అధ్యక్షుడు దశరథ్, తహసీల్దారు విశ్వరాణి, మాజీ డీసీసీబీ డైరెక్టర్ రాంచెంద్రారెడ్డి, నాయకులు వెంకట్రెడ్డి, వెండికోలు రాములు, మున్సిపల్ కౌన్సిలర్లు ఎ.చిట్టిబాబు, కే.నాగరాజు, నాయకులు ఎం.జగన్మొహన్రెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.