byసూర్య | Tue, Oct 15, 2024, 09:42 PM
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఆవర్తనం ఒకటి కేంద్రీకృతమైందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.
ఈ మేరకు నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక రేపు (బుధవారం) ఉమ్మడి నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేశారు.
ఇక సోమవారం సాయంత్రం హైదరాబాద్ నగరంతో పాటుగా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నగరంలోని బాలానగర్, ఖైరతాబాద్, హైదర్నగర్, ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, ప్రగతినగర్, పటాన్చెరు, మేడ్చల్, దుండిగల్, కృష్ణాపూర్, గండిమైసమ్మ, మల్లంపేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా తాండూరు, గుండ్ల పోచంపల్లి, బహదూర్పల్లి, సూరారం తదితర ప్రాంతాల్లో వానలుపడ్డాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు కూడా నగరంలో వర్షాలకు ఛాన్స్ ఉండగా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలో భారవర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న నాలుగు రోజులు అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.