byసూర్య | Mon, Sep 23, 2024, 07:25 PM
అమృత్ టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసాన్ని బయటపెట్టినందుకు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు తనను అభినందించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.కాంగ్రెస్ సీనియర్ల నుంచి తనకు అభినందనల వస్తే, తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంలో మౌనంగా ఉండటం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు. తమకు ఏమి తెలియనట్లు, వినబడనట్లు బీజేపీ నేతల వ్యవహారం ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డి, బీజేపీ నేతల మధ్య అద్భుతమైన ప్రేమకథనే నడుస్తోందని చురక అంటించారు.అమృత్ టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. నిజాలు నిగ్గు తేల్చాలంటూ కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, టోచన్ సాహుకు మూడు రోజుల క్రితం లేఖ కూడా రాశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కల్లిబొల్లి మాటలు చెప్పి పెద్దమనుషులను కూడా మోసం చేసిందని కేటీఆర్ మరో ట్వీట్లో విమర్శించారు. ఆసరా పెన్షన్లతో అవ్వ- తాతలకు కేసీఆర్ ప్రభుత్వం భరోసా నింపారని, నాడు బీఆర్ఎస్ రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి కోడలు, కోడళ్ళు ప్రేమగా చూసుకునేలా చేసిందని పేర్కొన్నారు. కేసీఆర్ బొడ్లో సంచి బరువు పెంచి అమ్మమ్మ-నాయనమ్మ ల గౌరవం పెంచారని పేర్కొన్నారు.రూ.4 వేలు ఇస్తానని అబద్దపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ముసలవ్వలను రోడ్డు మీదకు తీసుకువచ్చాడని విమర్శించారు. మొన్న గద్వాల్ లో అవ్వా-తాతలు రోడ్ల మీద ధర్నా చేయగా, ఈరోజు వృద్ధ దంపతులు మానకొండూర్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చారని పేర్కొన్నారు. ఇందుకు సిగ్గనిపించడం లేదా రేవంత్ రెడ్డి? అని నిలదీశారు. తక్షణం జూటా హామీని ఆపివేసి, అవ్వలకు 4 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.