వైద్యవిద్యలో స్థానికత వివాదం.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

byసూర్య | Fri, Sep 20, 2024, 07:16 PM

వైద్యవిద్య కోర్సుల ప్రవేశాల్లో స్థానికత అంశంపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు జారీచేసింది. స్థానికత విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు కౌన్సిలింగ్‌కు హాజరుకావచ్చని తెలిపింది. ఈ ఒక్కసారికి మినహాయింపు ఇస్తున్నట్టు తేల్చిచెప్పింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడంతో స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు.. విచారణను మూడు వారాలు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగుతుందని పేర్కొంది.


వైద్య కళాశాలల్లో స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు మెడికల్‌, డెంటల్‌ కాలేజీల ప్రవేశాల్లో అవకాశం కల్పించాలని కోర్టు తేల్చిచెప్పింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టి ఈ ఏడాదికి సడలింపు ఇచ్చింది.


వైద్య విద్య ప్రవేశాల్లో నిబంధనలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 33ను రద్దు చేయడం వల్ల స్థానికులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని, దేశవ్యాప్తంగా ఉన్నవారందరూ 85 శాతం స్థానిక కోటా కింద అడ్మిషన్లు పొందేందుకు వీలు ఏర్పడుతుందని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. కాబట్టి సవరణ నిబంధనను రద్దు చేయడం లేదని చెప్పింది. ఈ నిబంధన కింద తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారు స్థానిక కోటా కింద మెడికల్‌ అడ్మిషన్లు పొందడానికి అర్హులేనని తేల్చి చెప్పింది విద్యార్థి స్థానికత నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాలు లేనందున వాటిని రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో విద్యాభ్యాసం జరగలేదన్న కారణంతో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్‌ నిరాకరించరాదని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది.


అలాగే, ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను పరిశీలించి ప్రతి విద్యార్థిని స్థానిక కోటా కింద అన్వయించి కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్సిటీ సీట్లను కేటాయించాలని ఆదేశించింది. నిబంధన ప్రకారం నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదివి ఉండాలని, శాశ్వత నివాసం ఉండాలని స్పష్టంగా తెలిపింది. అంతేకాదు, అర్హత పరీక్షలో తెలంగాణ నుంచి ఉత్తీర్ణత సాధించి ఉండాలని చెప్పింది.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM