byసూర్య | Mon, Sep 16, 2024, 07:55 PM
గణేష్ నవరాత్రి ఉత్సవాల వేళ హైదరాబాద్ మణికొండ అల్కాపురి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వేలంలో లడ్డూ దక్కించుకున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి.. కాసేపటికే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. రూ. 15 లక్షలకు వేలంలో గణేషుడి లడ్డూను సొంతం చేసుకొని ఉత్సాహంగా ఆడిపాడాడు. డీజే సౌండ్స్కు హుషారుగా నృత్యం చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లి కూర్చున్నచోటే కుప్పకూలిపోయాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.
వివరాల్లోకి వెళితే.. మణికొండ అల్కపురి కాలనీలో నివాసముండే శ్యామ్ ప్రసాద్ ఓ ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కాలనీలో మండపంలో వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. సెప్టెంబర్ 15న తొమ్మిదో రోజు నిమజ్జనం ఏర్పాట్లు చేశారు. వినాయకుడి చేతిలోని లడ్డూను వేలం వేయగా.. లడ్డూను దక్కించుకునేందుకు కాలనీ వాసులు పోటీపడ్డారు. వేలంలో పాల్గొన్న శ్యామ్ ప్రసాద్ ఏకంగా రూ. 15 లక్షలకు లడ్డూను దక్కించుకున్నాడు.
ఆ ఆనందంలో శ్యామ్ ప్రసాద్ మండపం వద్దే హుషారుగా కాసేపు డ్యాన్స్ చేశాడు. డీజే సౌండ్స్కు కాలనీ వాసులతో కలిసి స్టెప్పులేశాడు. ఆడిపాడి ఎంజాయ్ చేసిన శ్యామ్.. లడ్డూను తీసుకొని ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నాడు. డ్యాన్స్ చేసి అలసిపోయిన అతడు సోఫాలో కాసేపు కూర్చుకున్నాడు. కాసేపటికే ఛాతీలో నొప్పి వస్తుందని.. కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.
దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. అప్పటి వరకు సరదాగా ఆడిపాడిన శ్యామ్ ఇలా ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోవటంతో కాలనీలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. వేలం పాటలో దేవుడి లడ్డూ దక్కించుకున్న శ్యామ్.. క్షణాల్లోనే ఆ దేవుడి దగ్గరికే వెళ్లిపోయాడంటూ స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. విధి ఎంత విచిత్రమైనదో అంటూ బోరున విలపించారు. అయితే ఇటీవల కాలంలో హార్ట్ ఎటాక్ మరణాలు ఎక్కువయ్యాయి. డీజే సౌండ్లు కూడా గుండె లయ తప్పటానికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. భారీ శబ్దాలు హార్ట్ ఎటాక్లకు దారి తీస్తాయని.. మితిమీరిన డీజే సౌండ్లు మంచివి కావని చెబుతున్నారు.