నొరో వైరస్.. వేగంగా పెరుగుతున్న కేసులు

byసూర్య | Sat, Jul 27, 2024, 07:52 PM

నొరో వైరస్‌ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వటమే కాకుండా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా.. కేవలం పాతబస్తీ ప్రాంతంలోనే రోజుకు 100 నుంచి 120 కేసులు నమోదవుతున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వెల్లడించింది. ఈ నొరో వైరస్ విషయంలో ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. నొరో వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు చేసింది.


అసలే వార్షాకాలం కావటం.. ఎడతెరపి లేకుండా కురిసే వర్షాలతో పరిసరాలన్ని దుర్గంధంగా మారటంతో.. రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ క్రమంలోనే.. పలు కొత్త వైరస్‌లు పుట్టుకొస్తుండగా.. ఇప్పుడు ఈ నొరో వైరస్ అందరినీ భయపెడుతోంది. నొరో వైరస్ సోకడానికి.. కలుషిత నీరే ప్రధాన కారణంగా చెప్తున్నారు. కలుషిత నీటితో పాటు నాణ్యతలేని ఆహారం కూడా ఈ వ్యాధికి కారకంగా వైద్యులు చెప్తున్నారు. ఈ వైరస్ సోకినవారికి.. చలి జ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ లక్షణాలు ఉంటాయని జీహెచ్ఎంసీ చెప్తోంది. ఇదొక రకమైన అంటువ్యాధి కావటంతో.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.


జీహెచ్ఎంసీ సూచనలు


ప్రజలంతా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని.. కాచి చల్లార్చి వడపోసిన నీటిని తాగాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఇంటిని పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలని సూచించింది. కాగా.. ప్రస్తుతం ఈ నొరో వైరస్ కేసులు హైదరాబాద్‌లోని యాకత్ పురా, మలక్ పేట్, డబీర్ పురా, పురానీ హవేలీ, మొఘల్ పురాతో పాటు పలు ప్రాంతాల్లో ఎక్కువగా నమోదు అవుతున్నట్టు తెలుస్తోంది ఈ వైరస్ బారిన పడిన వారు ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.


గత వారం రోజుల వ్యవధిలో.. పాతబస్తీ ప్రాంతంలోనే వందల సంఖ్యలో నొరో వైరస్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఇది అంటువ్యాధి కావటంతో.. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్నట్టు సమాచారం. నొరో వైరస్‌ను వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు. వానాకాలంలోనే ఈ వైరస్ సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. ప్రధానంగా అపరిశుభ్రత వల్లే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


నొరో వైరస్ సోకిన వారిలో కనిపించే లక్షణాలు..


నొరో వైరస్ సోకిన వారికి వాంతులు, విరేచనాలతో పాటు శరీరం డీహైడ్రేషన్ అవుతుంటుంది. వైరస్ సోకిన వ్యక్తిలో 48 గంటల్లోనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల.. మధ్య వయస్కులు, వృద్ధులు, గర్భిణులు, కౌమారదశలో ఉన్న బాలికల్లో తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్స్‌ను కలిగిస్తోందని వైద్యులు చెప్తున్నారు. శరీరం వేగంగా డీహైడ్రేషన్ అవ్వడంతో.. మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువుగా ఈ వైరస్ బారినపడే అవకాశాలున్నాయి.


ఇది ఒక అంటువ్యాధి కావటంతో ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపించే అవకాశం ఉంది. వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారికి లేదా కలుషితమైన పరిసరాల్లో ఉన్న వారికి ఈ వైరస్ సులభంగా వ్యాపిస్తుంది. అయితే.. ఈ వైరస్ సోకిన వారిలో చాలా మంది రెండు, మూడు రోజుల్లోనే కోలుకుంటారని వైద్యులు చెప్తున్నారు. నొరో వైరస్ కోసం ప్రస్తుతానికి ఎలాంటి టీకా అందుబాటులో లేదు. వైద్యులు సూచించిన మాత్రలు వాడటంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా రెండు నుంచి మూడు రోజుల్లో వైరస్ నుంచి కోలుకోవచ్చు.


నొరో వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు


అయితే.. నొరో వైరస్ సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది అంటువ్యాధి కావటంతో.. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. వేడి నీళ్లను తాగటం మంచిది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వేడి వేడి ఆహారాన్ని, శుభ్రమైన ఆహార పదర్థాలను తీసుకోవాలి. వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించిన దుస్తులను వేడి నీటితో శుభ్రం చేయాలి. వైరస్ సోకిన వ్యక్తికి తగ్గేవరకు దూరంగా ఉండాలి.


Latest News
 

భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM
దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిపై.. హెచ్‌ఎండీకే హైకోర్టు నోటీసులు జారీ Fri, Sep 20, 2024, 08:34 PM
పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయించాలని వినతి Fri, Sep 20, 2024, 08:30 PM
ఓఆర్ఆర్‌పై కొత్తగా మరో మూడు ఇంటర్‌చేంజ్‌లు.. ఆ ప్రాంతాల్లో ఏర్పాటు Fri, Sep 20, 2024, 08:19 PM