![]() |
![]() |
byసూర్య | Thu, Jul 25, 2024, 06:50 PM
హైదరారాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మెట్రో విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు చేసారు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేటాయింపులను వెల్లడించారు. హైదరాబాద్ నగరం ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటుందని.. అందుకు ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను పటిష్ఠం చేస్తామన్నారు. అందులో హైదరాబాద్ మెట్రో ట్రైన్ వ్యవస్థ అతి ముఖ్యమైనదని చెప్పారు.
ప్రస్తుతం మూడు ట్రాఫిక్ కారిడార్లలో మెట్రో సౌకర్యం ఉందని చెప్పారు. మెట్రో మొదటి దశలో కలిగిన అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం రెందో దశ ప్రతిపాదనలను సమీక్షించి, వాటిని సవరించి, కొత్త ప్రతిపాదనలను రూపొందించనుందన్నారు. వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 78.4 కి.మీ. పొడవు ఉన్న ఐదు ఎక్స్టెండెడ్ కారిడార్లను రూ.24,042 కోట్లతో అభివృద్ధి పరుస్తుందన్నారు.
ఇందులో భాగంగా మెట్రో రైలును పాత నగరానికి పొడిగించి దానిని శంషాబాద్ విమానాశ్రాయానికి అనుసంధానం చేస్తామన్నారు. ప్రస్తుతమున్న కారిడార్లను నాగోలు నుంచి ఎల్.బి.నగర్ వరకు విస్తరిస్తామన్నారు. నాగోలు-ఎల్.బి నగర్ -చంద్రాయణగుట్ట స్టేషన్లను ఇంటర్ చేంజ్ స్టేషన్లగా అభివృద్ధి చేస్తామన్నారు. మియాపూర్ నుండి పటాన్ చెరువుకు, ఎల్.బి.నగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. అందులో భాగంగా ఎయిర్ పోర్ట్ మెట్రో రూ.100 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్కు రూ.500 కోట్లు, పాతబస్తీ మెట్రోకు రూ.500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
రూ.2.91 లక్షల కోట్లతో బడ్జెట్.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ రూ.2,91,159 లక్షల కోట్లు. అందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా... మూలధనం వ్యయం రూ.33,487 కోట్లు. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ను రూపొందించారు.