సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్

byసూర్య | Tue, Jul 09, 2024, 10:31 PM

తెలంగాణలో మరో ఎన్నికల పర్వం మొదలవనుంది. గత డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. మేలో పార్లమెంట్ ఎన్నికలు జరగ్గా.. ప్రస్తుతం అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. కాగా.. సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మంగళవారం రోజున మహబూబ్ నగర్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. స్థానిక సంస్థల గురించి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు. కాగా.. రైతు రుణమాఫీ పూర్తి చేసిన తర్వాతే.. సర్పంచ్ ఎన్నికలకు పోదామంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా.. రుణమాఫీని ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తే.. అదే నెల చివర్లోనో.. లేదా సెప్టెంబర్ మొదటి వారంలోనో స్థానిక ఎన్నికలకు నగారా మోగే అవకాశం ఉంది. కాగా.. ఈ స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కష్టపడి పని చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇన్ని రోజులూ.. నేతల కోసం కార్యకర్తలు తీవ్రంగా కష్టపడ్డారని.. ఇప్పుడు అదే కార్యకర్తలను సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలిపించేందుకు నాయకులు పని చేయాలని పిలుపునిచ్చారు.


కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన 35 మందికి నామినేటేడ్ పదవులు ఇచ్చామని.. ఇందులో ఎవ్వరూ పైరవీలు చేసినవారు లేరని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలనే కుర్చీలో కూర్చోబెట్టాలని నేతలకు సూచించారు. తనకు వచ్చిన సీఎం పదవి కూడా కార్యకర్తల కష్టం, త్యాగాల ఫలితమేనని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తల్ని తప్పకుండా అదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత పదేళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్ఎస్ ప్రభుత్వం.. హింసించిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడుల సమయంలో.. కేసీఆర్ రాజనీతి ఎక్కడ పోయిందని నిలదీశారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ఉసురు తగిలిందంటూ కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.


ప్రస్తుతం తెలంగాణలో.. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవి కాలం ముగిసిన విషయం తెలిసిందే. కాగా.. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయటంలో.. రాష్ట్రంలో మరోసారి ఎన్నికల పండుగ షురూ కానుంది. అయితే.. రుణమాఫీ చేసిన తర్వాతే.. సర్పంచ్ ఎన్నికలకు పోవాలనుకోవటంపై పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. చెప్పినట్టుగానే రుణమాఫీ చేసి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ప్రచారం చేసుకునే అవకాశం ఉండటమే కాదు.. ఈ ఏడు నెలల కాలంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు కూడా కవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుందని యోచిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగింతే.. గ్రామాల్లో ఓట్లన్ని కాంగ్రెస్‌కే పడతాయని రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు.. క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ.. ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.



Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM