byసూర్య | Tue, Jul 09, 2024, 09:24 PM
తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం అర్హులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వారికి గుడ్న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో కొత్త సామాజిక పింఛన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగు ఉన్న పెన్షన్లతో పాటు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక సమర్పించాలని సూచించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని తమ ప్రభుత్వం పెంచనుందని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, చేనేత, ఫైలేరియా రోగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులకు పెన్షన్ ఇస్తున్నారు. ఆసరా పింఛను రూ.2,016, దివ్యాంగ పింఛను రూ.3,016 గా ఇస్తున్నారు. అయితే ఈ మెుత్తాన్ని చేయూత పథకం కింద వికలాంగులకు రూ. 6 వేలు, మిగిలిన వారికి నెలకు రూ. 4 వేలు అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
చేయూత పథకానికి అర్హులు..
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా తెలంగాణ వాసి అయి ఉండాలి
దరఖాస్తుదారు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందినవారై ఉండాలి
దరఖాస్తుదారు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత, బీడీ కార్మికులు, స్టోన్ కట్టర్లు, డయాలసిస్ రోగులు, ఫైలేరియా రోగులు మరియు ఎయిడ్స్ రోగులలో ఏదైనా ఒక వర్గానికి చెందినవారై ఉండాలి. అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించాలి.
చేయూత పథకం కోసం అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డ్
వయస్సు రుజువు కోసం జనన ధృవీకరణ పత్రం
కుల ధృవీకరణ పత్రం
ఆదాయ ధృవీకరణ పత్రం
వైద్య ధృవీకరణ పత్రం
రేషన్ కార్డు
బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోలు
ఇవి కాకుండా పథకానికి సంబంధించిన నిర్దిష్ట పత్రాలు అవసరం కావచ్చు