![]() |
![]() |
byసూర్య | Tue, Jul 09, 2024, 09:23 PM
ప్రస్తుత సమాజంలో ఏది తినాలన్నా, ఏది తాగాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాన్ని తినాలన్నా అనుమానంతో తినలేకపోతున్న దుస్థితి వచ్చింది. దీనికి కారణం.. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో బయటపడుతున్న భయంకర నిజాలే. పేరుమోసిన రెస్టారెంట్లు, ఫేమస్ హోటళ్లలో కూడా పరిస్థితి మరీ దయనీయంగా ఉండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇక 'కాదేదీ కల్తీకి అనర్హం' అన్నట్టుగా మారింది. ఏది పడితే అది కల్తీ చేసేస్తున్నారు కల్తీగాళ్లు. చిన్నపిల్లలు తాగే పాల దగ్గరి నుంచి పెద్దవాళ్లు పుచ్చుకునే మద్యం వరకు ప్రతీది కల్తీ చేస్తున్నారు.ఈ క్రమంలోనే.. కల్తీ వైన్ తయారు చేస్తున్న ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. హైదరాబాద్లోని లాలాగూడా విజయపురి కాలనీలో ఓ ఆంగ్లో ఇండియన్ మహిళ తన ఇంట్లోనే కల్తీ వైన్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తన ఇంట్లోనే రహస్యంగా.. ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా.. కుళ్లిపోయిన ద్రాక్ష పండ్లు, చక్కెరతో కల్తీ వైన్ తయారు చేసి.. వాటిని లీటర్, రెండు లీటర్ల బాటిళ్లలో నింపి విక్రయిస్తున్నట్టు అధికారులు బయటపెట్టారు.
ఈ మహిళ తయారు చేస్తున్న కల్తీ వైన్ను.. కొంతమంది ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్టు సమాచారంతో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3 లక్షల విలువైన 90 లీటర్ల కల్తీ ద్రాక్ష వైన్ నింపిన 112 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు వైన్ను నింపడానికి సిద్ధంగా ఉన్న ఖాళీ బాటిళ్లను అధికారులు సీజ్ చేశారు. అయితే.. గతంలోనూ ఈ మహిళ సోదరుడు కూడా కల్తీ వైన్ తయారు చేస్తూ అరెస్ట్ అయినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. మరోవైపు ఆహారపదార్థాల్లో బల్లులు, ఎలుకలు, బొద్దింకలు వస్తూ.. బయట తిండి తినాలంటేనే వాంతి చేసుకునే సంఘటనలు బయటపడుతున్నాయి. సోషల్ మీడియాలో రోజూ ఇలాంటి వార్తలే కనిపిస్తుండటం.. తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.