byసూర్య | Tue, Jul 09, 2024, 09:20 PM
తెలంగాణ పోలీసులు దేశంలోనే ది బెస్ట్ అని ఓ వైపు ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే.. డిపార్ట్మెంట్లోని కొందరు అధికారులు మాత్రం ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారు. తమ చేష్టలతో పోలీస్ శాఖకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా మెలగాల్సిందిపోయి.. అసభ్యంగా మాట్లాడి డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు. తాజాగా.. నల్గొండ జిల్లా శాలిగౌరారం ఎస్సై ప్రవీణ్ కుమార్ తీరు చర్చనీయాంశంగా మారింది. ఓ కేసు విషయమై స్టేషన్కు వచ్చిన మహిళను ఎస్సై అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తనతో ఎస్సై నీచంగా ప్రవర్తించాడని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మీడియా మందుకు రాగా.. అసలేం ఏం జరిగిందో ఆమె మాటల్లోనే.... మాది శాలిగౌరారం మండలంలోని వంగమర్తి గ్రామం. నా భర్త నన్ను వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయమై నేను స్టేషన్లో కేసు పెట్టాను. ఆ తర్వాత సెటిల్మెంట్ పేరుతో నా పిల్లల పేరుతో కొంత భూమి రాసిస్తామని నా భర్త కుటుంబ సభ్యులు పెద్ద మనుషులతో చెప్పించారు. ఇదే విషయాన్ని ఎస్సై ప్రవీణ్ కుమార్తోనూ ఫోన్లో చెప్పించారు. అయినా నేను వినలేదు. దీంతో మరుసటి రోజు నేను మా డాడీ.. ఓ పెద్ద మనిషిని తీసుకొని స్టేషన్కు వెళ్లాం. ఎస్సై చాంబర్లో కూర్చొని వివరాలు అడిగాడు.
ఆ తర్వాత నాతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి మా డాడీని, పెద్ద మనిషిని బయటకు పంపాడు. అనంతరం మీ పెళ్లి ఎప్పుడు జరిగింది..? పిల్లలు ఎప్పుడు పుట్టారు..? ఇప్పుడు ఒంటరిగా ఎలా ఉంటావ్.. అంటూ పర్సనల్గా అడిగాడు. లేడీ కానిస్టేబుల్ లేకుండానే ఎస్సై నన్ను ఈ ప్రశ్నలు అడిగాడు. ఆ తర్వాత మీకు వంటలు చేయటం వచ్చా..? అని అడిగాడు. నాకు రావని చెబితే.. చేపల కూర, చికెన్ ఫ్రై వస్తే పర్సనల్గా బయట కలుద్దాం అని చెప్పాడు. అనంతరం స్టేషన్లోనే నాతో గ్రీన్ టీ పెట్టించాడు. ఆ తర్వాత కంప్లైంట్ పేపర్లో నా ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన పర్సనల్ ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చాడు.
ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. కాల్ చేయాలని వక్రబుద్ధితో మాట్లాడాడు. అన్ని విషయాల్లో తోడుంటానని చెప్పాడు. దాదాపు గంటన్నర తర్వాత నన్ను బయటకు పంపాడు. ఇక్కడ జరగిన విషయాలు ఎవరికైనా చెబితే మీ కుటుంబానికి ఇబ్బందులు తప్పవని బెదిరించాడు. ఆ తర్వాత రోజు రాత్రి సమయంలో ఫోన్ చేశాడు. మరుసటి రోజు ఉదయం కూడా హాయ్.. గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టాడు. నాకేందుకు మెసేజ్లు చేస్తున్నారని అడిగితే.. ఊరికే అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. ఇదే విషయాన్ని గతంలో నేను ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అందుకే మరోసారి ఫిర్యాదు చేశాను. అని బాధితురాలు ఎస్సై ప్రవీణ్ కుమార్పై ఆరోపణలు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం కావటంతో జిల్లా ఎస్పీ యాక్షన్లో దిగారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ను వీఆర్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.