![]() |
![]() |
byసూర్య | Tue, Jul 09, 2024, 08:08 PM
పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాల కింద రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తోంది. బీఆర్ఎస్ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో రూ. 50 వేల సాయం అందించగా.. రెండోసారి అధికారంలోకి రాగానే మరో రూ.50 వేలు పెంచుతూ రూ. లక్ష సాయం అందించారు. పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులకు ఆడి పిల్లల పెళ్లి ఖర్చులకు ఈ డబ్బులు వారి అకౌంట్లలో జమ చేసేవారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఆడ పిల్లల పెళ్లి ఖర్చులకు రూ. లక్ష ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. ఇప్పటి వరకు ఈ పథకం అమలు కాలేదు. చాలా మంది పేదింటి ఆడ పిల్లల తల్లిదండ్రులు కాంగ్రెస్ అమలు చేయనున్న కొత్త పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని చెప్పారు.
సోమవారం (జులై 8న) తన నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన రామ్మోహన్ రెడ్డి.. త్వరలోనే రూ. లక్షతో పాటు తులం బంగారాన్ని అందించేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈ పథకం కింద దరఖాస్తులు చేయటంలో జాప్యం చేయరాదని సూచించారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటు పడుతోందని చెప్పారు. ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని.. త్వరలోనే తులం బంగారం ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కార్యచరణ ప్రారంభించిందని చెప్పారు. పథకం అమలు, విధివిధానాల రూపకల్పన జరుగుతోందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు.
పథకానికి అర్హులు వీరే..
పేదింటి ఆడ పిల్లల పెళ్లి ఖర్చులకు ఈ ఆర్థిక సాయం అందజేస్తారు.
దరఖాస్తుదారు తప్పనిసరిగా తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
పెళ్లి చేసుకున్న అమ్మాయికి 18 ఏళ్లు పూర్తి కావాలి. వరుడు తప్పనిసరిగా 21 సంవత్సరాలు పూర్తి కావాలి.
దరఖాస్తుదారుడు తప్పనిసరిగా SC, ST, BC మరియు EBC వర్గాలకు చెందినవారై ఉండాలి.
దరఖాస్తుదారుడి కుటుంబ ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు.