byసూర్య | Sat, Jun 15, 2024, 08:34 PM
తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. అయినా కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా వర్షాలు కురవటం లేదు. ఇప్పటికే విత్తనాలు విత్తిన రైతుల వాన కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. మేఘాలు కమ్ముకుంటున్నాయే తప్ప.. వరుణుడు మాత్రం కరుణించటం లేదు. కొన్ని జిల్లాల్లో అయితే వర్షం కురిసి వారం దాటింది. ఈ నేపథ్యంలో నేటి వాతావరణం ఎలా ఉందో ఓసారి తెలుసుకుందాం.
వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకు వాతావరణశాఖ గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించిందని చెప్పారు. ఇది సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ మధ్యలో కొనసాగుతుంన్నారు. గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపుకు వీస్తున్నాయన్నారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీస్తాయన్నారు.
నేడు మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, నిజామాబాద్, నల్లగొండ, , జోగులాంబ గద్వాల, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇక ఆదివారం (జూన్ 16) ములుగు, భదాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, నిజామబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.