byసూర్య | Sat, Jun 15, 2024, 08:32 PM
హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేయటానికి రీజినల్ రింగు రోడ్డు నిర్మించతలపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న ఔటర్ రింగు రోడ్డుకు 40. కి.మీ దూరం నుంచి ఈ ప్రతిపాదిత ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. తెలంగాణకు ఇది సూపర్ గేమ్ ఛేంజర్ అని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ రహదారిలో ఉత్తర భాగానికి ఇప్పటికే జాతీయ రహదారి హోదా లభించింది. దక్షిణ భాగం ఎలైన్మెంట్ ఖరారు కాగా.. అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఆ తరవాత దక్షిణ భాగానికి కూడా జాతీయ రహదారి హోదా ఇచ్చి, నంబరు కేటాయిస్తారు.
ఉత్తర భాగాన్ని సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగ్దేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ మీదుగా నిర్మించనున్నారు. అయితే ఉత్తర భాగంలో 2.95 కి.మీ. మేర పొడవు పెంచాలని తాజాగా నిర్ణయించారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియడంతో రెవెన్యూశాఖ భూసేకరణపై దృష్టి సారిస్తుందని అధికారులు చెబుతున్నారు. నాలుగైదు నెలల్లో భూ సేకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. గతంలో ఉత్తర భాగంగా పొడవును 158.64 కి.మీ ఉండగా.. తాజాగా 161.59 కి.మీ.కు సవరించారు. ఇక చౌటుప్పల్, ఆమన్గల్, షాద్నగర్, చేవెళ్ల, సంగారెడ్డి మీదుగా నిర్మించనున్న దక్షిణ భాగాన్ని కూడా పెంచుతున్నారు. గతంలో 181.87 కి.మీ. ఉన్న అలైన్మెంట్ను 189.20 కి.మీ.కు పెంచారు.
తాజా ఎలైన్మెంట్తో ప్రాంతీయ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి 10.28 కి.మీ. పెరిగింది. రెండు భాగాల విస్తీర్ణం 350.79 కి.మీ.కు చేరింది. ప్రాంతీయ రింగు రోడ్డును ప్రతిపాదించిన సమయంలో రెండు భాగాలు కలిపి 340.51 కి.మీ.ఉంది. రెండు భాగాల అనుసంధానత కోసం పెంపు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరభాగం రహదారి నిర్మాణానికి మూడు, నాలుగు నెలల్లో శంకుస్థాపన చేయాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇప్పటికే భూసేకరణను వేగవంతం చేయాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులు రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఉత్తర భాగం రహదారిని ఆరు ప్యాకేజీలుగా విభజించారు. ఒక ప్యాకేజీలో అత్యధికంగా 34.52 కి.మీ. గా ఖరారు చేయగా.. అతి తక్కువగా 17.9 కి.మీ.గా నిర్ణయించారు.