byసూర్య | Fri, May 31, 2024, 11:50 AM
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు శుక్రవారం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయనున్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీజేపీ నేతలు ధర్నా చేపట్టనున్నారు.పోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత (కాంగ్రెస్) ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకు అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అయినా కేసు వ్యవహారం పట్టనట్లు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోందన్నారు. తప్పు చేస్తే జైలుకు పంపిస్తామని చెప్పిన సీఎం రేవంత్... ఇన్ని సంచలనాత్మక విషయాలు బయటకు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం స్కామ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీక్పై చర్యలు ఏవన్నారు. పోలీసు అధికారులు, కేసీఆర్ ప్రమేయంతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిందితుడు వాంగ్మూలంలో చెప్పారన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మాఫియా నడిపించారని మండిపడ్డారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాల ఫోన్లు, చివరికి జడ్జిల ఫోన్లూ ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా ఉన్న రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. అధిష్ఠానం ఒత్తిడికి లొంగిపోయారా? అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అక్రమ సంపాదనను తరలించి పోలీస్ వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశారన్నారు. కేసీఆర్, హరీశ్ రావు డైరెక్షన్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీస్ అధికారులు చెప్పారన్నారు. ఇంత స్పష్టంగా తెలుస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.
ఎన్నికల అనంతరం కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ఎంపీ లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఫేక్ సినిమా డ్రామా అని తానే ముందే చెప్పానన్నారు. "లిక్కర్ కేసులో కవితను గట్టెక్కించేందుకు ఎమ్మెల్యేల కేసు బయటకు తీసుకొచ్చారు. దారుణమైన స్థితికి కేసీఆర్ దిగజారిపోయారు. రేవంత్పై ఢిల్లీ పెద్దల ఒత్తిడి ఉంది. లేదంటే వెంటనే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు, పాత్ర దారులపై చర్యలు తీసుకోవాలి. కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలి" అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.