byసూర్య | Mon, May 27, 2024, 07:51 PM
తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావటంతో శుక్రవారం, శనివారం, ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వయంభువుడైన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో బారులు తీరారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రల నుంచి నుంచీ అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది.
మొక్కు పూజలు నిర్వహించిన భక్తులతో మండపాలు సందడిగా మారాయి. ఈ మూడ్రోజులు వేకువజాము నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. ఆలయ మాడ వీధులు, పట్టణ దారులన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఆదివారం 81 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మెుత్తంగా మూడ్రోజుల్లో 2 లక్షల 15 వేలమంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. మూడు రోజుల్లో శ్రీ స్వామి వారి ఆర్థిత సేవలు. హుండీ ద్వారా 2 కోట్ల 12 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.