ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే

byసూర్య | Mon, May 27, 2024, 07:47 PM

తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసే సమయానికి 68.65 శాతం పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించిన కారణంగా తుది గణాంకాలు వచ్చే సరికి అధిక సమయం పడుతుంది. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం - నల్గొండ - వరంగల్‌ జిల్లాల్లో సోమవారం (మే 27) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద గ్రాడ్యుయేట్లు ఉదయం నుంచే క్యూ కట్టారు. చెదురు మదురు ఘటనలు మినహా.. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.


ఎమ్మెల్సీ ఉపఎన్నికలో మొత్తం 49 మంది బరిలో నిలిచారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి చింతపండు నవీన్ (తీన్మార్‌ మల్లన్న) బరిలో నిలిచారు. ఇతర అభ్యర్థులు, స్వతంత్ర్య అభ్యర్థులు కలిపి మొత్తం 49 మంది పోటీలో నిలిచారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 4,63,839 ఓట్లు ఉన్నాయి.


ప్రాధాన్యత ఓటు పద్ధతి


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఓటు పద్ధతి ప్రకారం ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అంటే.. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎదురుగా ఉన్న గడిలో మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ప్రకారం.. ఓటర్ వరుస అంకెలు (i.e. 1, 2, 3, ..) వేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈవీఎంలను వినియోగించే అవకాశం ఉండదు. బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించే ఈ ఎన్నికల్లో.. ఓటర్లు పోలింగ్‌ కేంద్రంలో అధికారులు ఇచ్చే వైయలెట్ రంగు పెన్నుతో ప్రాధాన్యతను టిక్‌ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘నోటా’కు ఓటు వేసే అవకాశం ఉండదు.


ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడువేలుకు పోలింగ్ సిబ్బంది సిరా చుక్క పెట్టారు. అందువల్ల ఈ ఎన్నికల్లో ఎడమచేయి మధ్య వేలుకి సిరా చుక్క వేశారు. క్యూలో ఉన్న ఓటర్లకు సాయంత్రం 4 గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. అయితే, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపును జూన్‌ 5న చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు.



Latest News
 

హైదరాబాద్‌లో భారీగా కుంగిన రోడ్డు.. పెద్ద ప్రమాదమే తప్పింది Wed, Oct 23, 2024, 07:07 PM
మహబూబ్ నగర్: నీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడండి: కలెక్టర్ Wed, Oct 23, 2024, 07:07 PM
స్కూల్‌ బస్సు ఢీకొని ఆరేళ్ల చిన్నారి మృతి Wed, Oct 23, 2024, 07:05 PM
నర్వ: పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ Wed, Oct 23, 2024, 07:03 PM
హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. వారం రోజుల పాటు ఆ ఫ్లైఓవర్ మూసివేత..! Wed, Oct 23, 2024, 07:01 PM