byసూర్య | Sun, May 26, 2024, 07:30 PM
ప్రమాదవశాత్తు ఓ యువకుడి ఛాతీలోకి బాణం దూసుకెళ్లింది. దాదాపు సగం వరకం బాణం శరీరంలోకి దూసుకెళ్లినా.. అతడు ప్రాణాలు దక్కించుకున్నాడు. 24 గంటలు నరకయాతన అనుభవించిన యువకుడికి నిమ్స్ డాక్టర్లు పునర్జన్మను ప్రసాదించారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపుర్ జిల్లా ఊసూర్ ప్రాంతానికి చెందిన సోది నంద(17) అనే గుత్తికోయ యువకుడు గురువారం స్థానికంగా ఉన్న అడవిలోకి వెళ్లాడు. అయితే ఓ వ్యక్తి వేసిన బాణం ప్రమాదవశాత్తు అతడి ఛాతీలో దూసుకెళ్లింది.
దీంతో అతడిని వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ల సూచనలతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్కు తీసుకొచ్చారు. డాక్టర్లు తొలుత సీటీస్కాన్ తీశారు. ఊపిరితిత్తుల పక్క నుంచి గుండెలోని కుడి కర్ణికలోకి బాణం గుచ్చుకున్నట్లు స్కాన్ ద్వారా గుర్తించారు. అప్పటికే భారీగా బ్లడ్ బ్లీడింగ్ అయింది. దీంతో ఒక వైపు రక్తం ఎక్కిస్తూనే మూడు గంటలపాటు శ్రమించి సర్జరీ చేసి బాణాన్ని తొలగించారు.
బాణం దిగిన చోట రక్తస్రావమై గడ్డకట్టడంతో ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు. ఆ యువకుడు సొంతంగా బాణాన్ని తీసే ప్రయత్నం చేసి ఉంటే మరింత రక్తస్రావమై పరిస్థితి చేజారిపోయేదని తెలిపారు. మానవీయ కోణంలో ఈ చికిత్సను నిమ్స్ పూర్తి ఉచితంగా చేసిందని అన్నారు. యువకుడు కోలుకున్న వెంటనే డిశ్ఛార్జి చేస్తామని డాక్టర్లు వెల్లడించారు.