byసూర్య | Sun, May 26, 2024, 07:23 PM
తెలంగాణలో మత్తు పదార్థాల వినియోగంపై రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్ ఫ్రీ స్టేట్గా రాష్ట్రాన్ని మార్చాలని సీఎం అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ కేసుల్లో సెలెబ్రిటీలున్నా.. ఎంత పెద్దవారున్నా ఉపేక్షించొద్దని క్లియర్గా చెప్పేశారు. అవసరమైతే డ్రగ్ కంట్రోల్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని.. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నారు.
ఇదిలా ఉండగానే ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకంను నిషేదం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం ప్రజారోగ్యం దృష్ట్యా గుట్కా తయారీ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. పొగాకు, నికోటిన్, పౌచ్లు, ప్యాకేజీ కంటెయినర్లు మొదలైన వాటిలో ప్యాక్ చేసిన గుట్కా/పాన్ మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను నిషేధించిబడినట్లు పేర్కొన్నారు. ఈ నిషేధం 24 మే 2024 నుండి తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.