byసూర్య | Mon, May 20, 2024, 07:15 PM
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే పలువురు సీనియర్ పోలీసులను అదుపులోకి తీసుకుని విచారించగా.. కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని అరెస్టులు కూడా చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కొంత మంది పోలీసు అధికారులతో పాటు ఇతర వ్యక్తులను కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. విచారణ జరుగుతున్న పోలీస్ స్టేషన్నే మార్చారు అధికారులు. బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు ఈ కేసును మార్చారు.
ఇప్పటి వరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు దర్యాప్తు జరగ్గా.. ఇప్పటి నుంచి జూబ్లీహిల్స్ పీఎస్లో విచారణ చేయనున్నారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వీలుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులు ప్రధాన నిందితునిగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉండగా... ఆయనకు ఇప్పటికే పోలీసులు లుక్ అవుల్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా.. విచారణకు హాజరు కావాలంటూ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుసతోంది.
ఓ వైపు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే.. ఈ కేసు విచారణను జూబ్లీహిల్స్కు మార్చటం ఆసక్తికరంగా మారింది. ఈమేరకు.. జూబ్లీహిల్స్ పీఎస్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో విచారణకు ఇబ్బందికరంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు.. ట్రాన్సిట్ నోటీసు జారీ అయిన వెంటనే ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు అనుకూలంగా జూబ్లీహిల్స్ ఠాణాకు మార్చారని ప్రచారం జరుగుతోంది.
కాగా.. విచారణలో ప్రభాకర్ రావు చెప్పిన కీలక అంశాలను బేస్ చేసుకొని.. మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులను మాత్రమే ఈ కేసులో అరెస్టు చేయగా.. ప్రభాకర్ రావు నోరు విప్పితే కీలక అంశాలు బయటికి వచ్చే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. ఈసారి పలువురు రాజకీయ నాయకుల అరెస్టులు కూడా ఉంటాయని ప్రచారం సాగుతోంది.