ఛోటే కాదు.. వాడు ‘తోపు’, చాలా కంట్రోల్ చేస్తున్నా: నవనీత్ రాణాకు అసదుద్దీన్ ఓవైసీ వార్నింగ్

byసూర్య | Fri, May 10, 2024, 07:29 PM

బీజేపీ నాయకురాలు, అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. తన సోదరుడిని ఆపడం ఎవరి తరంకాదని హెచ్చరించారు. ‘ఛోటేను చాలా కష్టంమీద కంట్రోల్ చేస్తున్నాను. ఛోటే కాదు.. వాడు తోపు. సాలార్ కొడుకు. చాలా కష్టంమీద నచ్చజెప్పాల్సి వస్తోంది అతడికి. అసదుద్దీన్ ఓవైసీ మాట మాత్రమే వింటాడు అతడు. అతడిని ఆపడం మీ తరం కాదు, ఎవరి అయ్య తరం (కిసీ కా బాప్) కాదు. 15 సెకన్లు చాలట. మేమేమైనా కోడిపిల్లలమా? నువ్వు మొదలుపెట్టి చూడు’ అంటూ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో మజ్లిస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు.


‘హైదరాబాద్‌కు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వీళ్లను అడ్డుకునే వారే లేరా? భారత్‌లో ఏ చట్టమూ వీరిని అడ్డుకోదా? పోలీసులు ఏం చేస్తున్నారు?’ అని అసదుద్దీన్ ప్రశ్నించారు.


టాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి నవనీత్ కౌర్ (నవనీత్ రవి రాణా) వివాహం చేసుకున్న తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అమరావతి (మహారాష్ట్ర) స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలతకు మద్దతుగా గురువారం (మే 9) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువ మోర్చా సమావేశంలో మాట్లాడుతూ.. ఒవైసీ సోదరులపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.


హైదరాబాద్‌లో 15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే, తమ తడాఖా ఏమిటో చూపిస్తామని గతంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేశారు. నాటి వ్యాఖ్యలను గుర్తుచేస్తూ నవనీత్ కౌంటర్ ఇచ్చారు. ‘పోలీసులను 15 నిమిషాలు తప్పుకోమనండి, మేం ఏం చేయగలమో చూపిస్తామని ఛోటే (అక్బరుద్దీన్) అన్నాడు. నేను ఛోటేకు ఒక్కటే చెప్పదలుచుకున్నా. మీకు 15 నిమిషాలు పట్టొచ్చేమో, కానీ, మాకు 15 సెకన్లు చాలు’ అని నవనీత్ రాణా అన్నారు.


ఏఐఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే పాకిస్థాన్‌కు వేసినట్టే అని నవనీత్ రాణా విమర్శించారు. 39 సెకన్ల ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి, నేరుగా అక్బరుద్దీన్ ఒవైసీకి ట్యాగ్ చేశారు నవనీత్. ఈ నేపథ్యంలో నవనీత్ రాణా వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.


‘మీరు చెప్పినట్టే కానీయ్యండీ.. ఆట మొదలుపెట్టండి. ఇప్పుడు మీరు సింగిల్స్ తీసుకుంటున్నారు.. ఒకటి, రెండు అని. టీ20 మొదలైతే ఎలా ఉంటుందో చూస్తారా? 15 సెకన్లు చాలట. మేమేమైనా కోడిపిల్లలమా..? అరె.. మీరైనా చెప్పండి వాళ్లకు (కార్యకర్తలను ఉద్దేశించి). మీ తండ్రిని అడుగు. ఢిల్లీలో ఉండే పప్పాను అడుగు. ఎక్కడికి రమ్మంటారో చెప్పు. మీ ఇంటికి రావాలా? ఆఫీస్‌కు రావాలా? ఇంకా ఎక్కడికైనా రావాలా? అడిగి చెప్పు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు అసదుద్దీన్.


‘నేను ప్రధాని మోదీజీని కోరుతున్నాను. ఆమెకు 15 సెకన్లు కాదు, ఒక గంట సమయం ఇవ్వండి. ఆమె ఏమి చేస్తుందో చేయనీయండి. వాళ్లు ఏం చేస్తారో మేమూ చూడాలనుకుంటున్నాం. వారిలో మానవత్వం మిగిలి ఉందా? మేం భయపడుతూ కూర్చుంటామా? ఎవరైనా ఓపెన్ కాల్ చేస్తే ఇలాగే బదులిస్తాం’ అని ధ్వజమెత్తారు అసదుద్దీన్ ఓవైసీ. వీరి మాటల యుద్ధానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM