byసూర్య | Wed, Apr 24, 2024, 07:37 PM
విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చారు. దీంతో చాలా మంది పట్టణాలు వదిలి పల్లెలకు పయనమవుతున్నారు. చదువుల కోసం ఇన్నాళ్లు హైదరాబాద్లో ఉన్నవాళ్లు ఇప్పుడు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో ట్రైన్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. అలాగే వేసవి కావటంతో మరికొందరు టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కూడా ఉండటంతో సాధారణంగానే అన్ని ట్రైన్లలోనూ రద్దీ విపరీతంగా పెరిగింది.
రద్దీకి తగినట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రత్యేక ట్రైన్లను నడుపుతన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాలకు స్పెషల్ ట్రైన్లను నడిపిస్తున్నారు. అయితే టికెట్ల తీసుకునే సమయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన రద్దీతో టికెట్ తీసుకునే పరిస్థితి లేకుండా పోతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. ప్రతిరోజూ ప్రయాణించేవారి సంఖ్య 1.80 లక్షలుంటే.. వేసవి సెలవులు కావడంతో 2.20 లక్షల వరకూ ఉంటున్నారు. వీరిలో సాధారణ ప్రయాణికులే ఎక్కువ. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది.
దీంతో సౌత్ సెంట్రల్ రైల్వేఅధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టేషన్లో అదనంగా మరో 5 టిక్కెట్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక కౌంటర్లలో టికెట్లు తీసుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. భారీగా బారులు తీరాల్సిన పని లేకుండా టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులకు అనుగుణంగా ప్రత్యేక ట్రైన్లను కూడా పెంచుతామని చెప్పారు.