తాటివనాల వద్ద ఆ టెస్టులేంటి.. గీతన్నల పొట్టకొడతారా ?: బండి సంజయ్

byసూర్య | Sun, Apr 21, 2024, 08:02 PM

గీత కార్మికులను ఆదుకోవాలనే సోయి ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తాడూరు గ్రామంలో ఇటీవల కాలిపోయిన తాటి వనాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక గీత కార్మికులు, స్థానికులతో మాట్లాడారు. నష్టపోయిన గౌడన్నలను పరామర్శించారు. నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.


అనంతరం మీడియాతో మాట్లాడిన సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కొని ఈత మొక్కలను పెంచుతామని.. ఈత మొక్కల పెంపకానికి, బిందు సేద్యానికి 90 శాతం సబ్సిడీ ఇస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. గౌడన్నల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెడతామని ఎన్నికల్లో ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు.


'ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైంది ? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటింది. ఒక్కటంటే ఒక్క గ్రామంలోనైనా భూమిని కేటాయించారా ? ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణాలపై 90 శాతం సబ్సిడీ ఇస్తానన్నారు. ఒక్కరికైనా ఇచ్చారా ? జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని హామీ ఇచ్చారు ? ఆ హామీ ఏమైంది? అధికారంలోకి వచ్చాక అటకెక్కిస్తరు... ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టడానికి నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. పైగా సర్వాయి పాపన్న గౌడన్నల ఆత్మగౌరవ ప్రతీక. పార్టీలు, కులాలకు అతీతంగా జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడితే హర్షిస్తారు. మరి ఆ పని ఎందుకు చేయడం లేదు ?' అని సంజయ్ ప్రశ్నించారు.


గౌడన్నలు ప్రమాదవశాత్తు చనిపోతే పైసలివ్వడం కాదని.. బతికున్నప్పుడు ఉపాధి కల్పించాలని సంజయ్ డిమాండ్ చేశారు. తెల్లవారుజామున లేచి మోదు కట్టుకుని చెట్లు ఎక్కి కల్లు గీస్తుంటే... తాటి చెట్ల దగ్గర డ్రంకెన్ డ్రైవ్ పెట్టి వేధిస్తే కల్లు తాగడానికి ఎవరొస్తారని ప్రశ్నించారు. మద్యం షాపులు దగ్గర కమీషన్లు తీసుకొని.. ఆరోగ్యకరమైన కల్లు తాగేటోళ్లను తాటి వనాలకు రాకుండా చేస్తున్నారన్నారు. గీత కార్మికుల సంక్షేమమంటే ఇదేనా ? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం గీత కార్మికులను ఆదుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు.



Latest News
 

హైదరాబాద్‌లో ఐటీ దాడులు Tue, Sep 24, 2024, 12:42 PM
దోషులను కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు Tue, Sep 24, 2024, 12:40 PM
యోగా శిక్షకుల నియామక ఇంటర్వ్యూలకు స్పందన Tue, Sep 24, 2024, 12:39 PM
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ పోస్ట్ Tue, Sep 24, 2024, 11:44 AM
సీఎం సలహాదారుడుని కలిసిన గడ్డిఅన్నారం పాలకవర్గం Tue, Sep 24, 2024, 11:39 AM