byసూర్య | Sun, Apr 21, 2024, 03:07 PM
బీజేపీకి, జనసేన పార్టీకి మధ్య దూరం పెరిగిందా అంటే.. అవుననే అంటున్నారు జనసైనికులు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు, జనసేన నేతలు కలిసి ప్రచారం నిర్వహించగా, మే 13న జరగనున్న సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మాత్రం రెండు పార్టీలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీతో కలిసి ప్రచారంలో పాల్గొనేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు ముందుకు వచ్చినప్పటికీ, కమలం పార్టీ నేతలు తగురీతిన ఆహ్వానం అందలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే తాము ఆ పార్టీతో కలిసి పనిచేసే పరిస్థితులు ఏర్పడకపోవడంపై కొందరు జనసేన నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేసే విషయమై తమ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందకపోవడం వల్లనే జనసేన నేతలు స్తబ్దుగా ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.