byసూర్య | Tue, Apr 09, 2024, 06:02 PM
పీసీసీ పదవిపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ పదవి అడగడం తనకు కొత్తేమి కాదని.. అవకాశం వచ్చిన ప్రతిసారీ అడుగుతానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. పీసీసీ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తే పర్వాలేదని.. కానీ వారిని కాదని రెడ్లలో ఎవరికైనా అవకాశం ఇస్తామంటే మాత్రం తాను ఊరుకోనని.. పోటీలో తప్పకుండా ఉంటానన్నారు. అయినా.. పీసీసీ మార్పునకు ఇప్పుడేమీ తొందర లేదన్నారు. లోక్ సభ, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేకే పీసీసీ మార్పు ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. బస్టాండ్లో తాను ఎక్కాల్సిన బస్సు వచ్చినప్పుడు కచ్చితంగా ఎక్కుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు.. లోక్ సభ ఎన్నికల్లో గిమ్మిక్కులతో అధికారంలోకి రావాలనేది మోదీ, అమిత్ షా చూస్తున్నారని జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డికి విషయ పరిజ్ఞానమే లేదంటూ ఎద్దేవా చేశారు. పదవుల కోసమే ఏర్పడిన పార్టీ బీజేపీ అని.. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. కేవలం బతుకుదెరువు కోసమే ప్రశాంత్ కిషోర్ సర్వే సంస్థ పెట్టుకున్నారని జగ్గారెడ్డి తెలిపారు. ఆయన ఓ సారి బీజేపీ అని.. ఇంకోసారి కాంగ్రెస్ అని తోచిన విధంగా సర్వేలు చెప్తారని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని పీకే చెప్పారని... కానీ ఏం జరిగిందంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ బౌండరీలో ఉండి మందకృష్ణ మాట్లాడుతున్నారని విమర్శించిన జగ్గారెడ్డి.. తటస్థంగా ఉంటూ ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తామన్నారు. బంగారు లక్ష్మణ్ను నవ్వుల పాలు చేసినప్పుడు మందకృష్ణ కనీసం స్పందించలేదని.. బీజేపీ తెలంగాణలో మాదిగను రాజ్యసభకు పంపమని మందకృష్ణ ఎందుకు అడగలేకపోయారని నిలదీశారు.