byసూర్య | Tue, Apr 09, 2024, 05:40 PM
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ మీటింగులో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఒకేసారి వేటు పడింది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. వీళ్లంతా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నందుకు గానూ.. 106 మందిని సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్లో ఉపాధి హామీ, సెర్ప్ ఉద్యోగులతో మెదక్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్ రవీందర్ రెడ్డి, మరికొందరు నాయకులు రహస్యంగా సమావేశం నిర్వహించారు. ఈ విషయం కాస్తా బయటకు తెలియటంతో.. వెంకట్రామిరెడ్డి, రవీందర్ రెడ్డిపై కేసు నమోదైంది.
ఈ క్రమంలోనే సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా.. మీటింగ్లో పాల్గొన్న ఉద్యోగులను గుర్తించి.. వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండైన వారిలో 38 మంది సెర్ప్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు.