byసూర్య | Tue, Apr 09, 2024, 05:36 PM
హైదారాబాద్ ఇల్లు కట్టుకునే వారు ఎదుర్కొనే ప్రధాన సమస్య అనుమతులు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల చుట్టూ తిరిగిన అంత తొందరగా అనుమతులు రావు. అధికారులు ఏదో సాకు చెప్పి.. అనుమతులు నిరాకరిస్తూ ఉంటారు. దీంతో ఇల్లు కట్టుకోవాలనుకునే సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక నుంచి ఆ ఇబ్బంది అక్కర్లేదు. ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ఆదేశారు జారీ చేశారు.
నిర్మాణ అనుమతుల అఫ్లికేషన్లు 21 రోజుల్లో ఆమోదం పొందాలని, లేనిపక్షంలో చర్యలుంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా అఫ్లికేషన్లు తొక్కిపెట్టే వారిని సహించేది లేదని అన్నారు. ప్రణాళిక విభాగం కార్యకలాపాలపై నగర ముఖ్య ప్రణాళికాధికారి రాజేంద్రప్రసాద్ నాయక్తో కలిసి ఆయన సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
టౌన్ప్లానింగ్ అధికారుల పనితీరు ప్రజల్లో నమ్మకం కలిగించేలా ఉండాలన్నారు. వేధింపులు, వసూళ్లనే అపవాదు తొలగిపోవాలన్నారు. కోర్టు కేసుల విషయంలో అశ్రద్ధ వహించొద్దని అన్నారు. చెరువుల సంరక్షణ బృందాల వాట్సప్ గ్రూపులో సంబంధిత టౌన్ప్లానింగ్ అధికారులను చేర్చాలని సూచించారు. ఇళ్లు నిర్మించుకునేవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేయాలన్నారు.