byసూర్య | Fri, Feb 23, 2024, 06:52 PM
అడుక్కోవటమే అతను చేసిన నేరమా.. లేదా అడుక్కునే స్థితికి రావటమే చేసుకున్న పాపమా.. కేవలం బిచ్చం అడిగినందుకు ఓ డిప్యూటీ తహసీల్దార్ పైశాచికత్వానికి యాచకుడి నిండు ప్రాణం.. లారీ చక్రాల కింద పడి నలిగిపోయింది. ఈ దారుణమైన సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చోటుచేసుకుంది. బిచ్చం అడిగాడన్న కోపంతో ఆ యాచకున్ని డిప్యూటీ తహసీల్ధార్.. పాశవికంగా తన్నడంతో అటుగా వెళ్తున్న టిప్పర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం సాయంత్రం జరిగిన ఈ అమానుష ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి సిగ్నల్ వద్ద ఆగిన కార్ల అద్దాలు తుడుస్తూ.. వాళ్లను డబ్బులు అడుక్కుంటూ శివరాం అనే యాచకుడు తన జీవనాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. గురువారం సాయంత్రం.. మెండోరా మండల డిప్యూటీ తహశీల్దార్ రాజశేఖర్.. తన కారులో అటుగా వెళ్తూ సిగ్నల్ దగ్గర ఆగాడు. అదే సమయంలో శివరాం కూడా.. రోజూ చేసే పనిలో భాగం.. డిప్యూటీ తహశీల్దార్ కారు అద్దాలను కూడా క్లీన్ చేశాడు. అనంతరం డబ్బులు ఇవ్వాలని కోరాడు. అయితే.. రాజశేఖర్ మాత్రం డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు.
ఇంతలోనే.. సిగ్నల్ పడటంతో రాజశేఖర్ తన కారును ముందుకు పోనిచ్చాడు. అయితే.. డబ్బులు ఇస్తాడేమో అన్న ఆశతో కారు వెంటే శివరాం పరుగులు పెట్టాడు. అది చూసి తీవ్ర కోపోద్రేకాని లోనైన రాజశేఖర్.. కారు ఆపి మరీ అందులో నుంచి దిగి.. శివరాంను కాలితో తన్నాడు. దీంతో.. అదుపు తప్పిన శివరాం.. తూలుతూ వెళ్లి రోడ్డుపై పడ్డాడు. అదే సమయంలో అటుగా టిప్పర్ వెళ్తుండటంతో.. వెనక టైర్లు శివరాం పైనుంచి వెళ్లాయి. దీంతో.. ఆ యాచకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. అక్కడి కూడలిలో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. మెండోరా డిప్యూటీ తహశీల్దార్ అమానుష చర్య బయటపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు.