ఢిల్లీకి గులాబీ బాస్ కేసీఆర్.. పొత్తు కోసమా.. సపోర్ట్ కోసమా..? సర్వత్రా ఉత్కంఠ.

byసూర్య | Tue, Feb 20, 2024, 08:33 PM

గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఏం చేసినా దాని వెనుక బలమైన రాజకీయ కోణం ఉంటుంది. ఆయన వేసే ప్రతి అడుగు ఎంతో వ్యూహాత్మకంగా ఉంటుంది. అలాంటిది.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయి.. ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. అయితే.. అప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ పూర్తి స్థాయిలో యాక్టివ్ కాలేదు. తాజాగా నిర్వహించిన నల్గొండ సభ మినహా.. ఆయన అటు అసెంబ్లీ సమావేశాలకు గానీ.. ఇటు రాజకీయ కార్యక్రమాలకు గానీ హజరుకాలేదు. అలాంటిది.. ఇప్పుడు ఢిల్లీకి పయనమవుతున్నారు గులాబీ బాస్.


త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనుండటం.. ప్రాజెక్టుల విషయంలో రేవంత్ సర్కార్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుండటం.. గులాబీ నేతలు కారు దిగి హస్తంతో దోస్తీ కడుతుండటం.. ఇవే కాకుండా ఈ మధ్య సోషల్ మీడియాలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు అంశం తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో.. కేసీఆర్ ఢిల్లీ టూర్ సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది.


అయితే.. ఈ వారంలో గులాబీ బాస్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీకి కేసీఆర్ వెళ్తుండటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంతకూ కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారనేది క్లారిటీగా తెలియకపోయినా.. రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటపెట్టే పనిలో మునిగిపోయింది.


ప్రధానంగా కాళేశ్వరంపై ఫోకస్ పెట్టింది. ఇటీవలే అసెంబ్లీలో ప్రాజెక్టులపై శ్వేతపత్రం కూడా విడుదల చేసి.. కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాగస్వామ్యమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదంటూ అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి హెచ్చిరించిన విషయం తెలిసిందే.


ఇదిలా ఉంటే.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోనున్నాయన్న అంశం.. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది. ఇదే విషయంపై బీజేపీ నేతలు మాత్రం సరేమిరా అంటూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. కానీ.. బీఆర్ఎస్ నేతలు మాత్రం.. ఏదో వినీ విననట్టుగా సైలెంట్‌గా ఉంటున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్‌ దూకుడును అడ్డుకోలేమని భావిస్తున్న కేసీఆర్.. పొత్తు వైపు అడుగులు వేస్తున్నారేమో అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.


అయితే.. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో.. కేసీఆర్ ఉన్నట్టుండి ఢిల్లీకి పయనమవుతుండటంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ పర్యటన పొత్తు కోసమా.. లేక అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు కేంద్రం సపోర్ట్ కోసమా అని మిగతా పార్టీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోనూ.. కవితను తప్పించేందుకు మోదీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఒకవేళ నిజంగానే.. ప్రాజెక్టుల విషయంలో సపోర్ట్ కోసమే అయితే.. కేటీఆర్, హరీశ్ లాంటి నేతలను పంపించినా సరిపోతుంది.. కానీ కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగుతున్నారంటే.. కథ ఇంకేదో ఉందని చర్చించుకుంటున్నారు.


ఇదిలా ఉంటే.. ఎన్డీఏతో కలిసేందుకు చాలా పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని.. త్వరలోనే భారీగా చేరికలు ఉంటాయని హోం మంత్రి అమిత్ షా ప్రకటించటం.. ఈ క్రమంలోనే కేసీఆర్ ఢిల్లీ టూర్‌కు సిద్ధమయ్యారని వార్తలు రావటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మరి.. ఇంతకూ కేసీఆర్ వేసే అడుగు ఎలా ఉండబోతోందని అన్నది.. వేచి చూడాల్సిందే.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM