రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం.. కేంద్రం కీలక నిర్ణయం, ఇక తగ్గేదేలే

byసూర్య | Tue, Feb 20, 2024, 08:03 PM

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును తెలంగాణకు తలమానికంగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. సగం తెలంగాణ అభివృద్ధి చెందేందుకు ఇది సూపర్ గేమ్ ఛేంజర్ అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు బీజం పడినా.. పనుల్లో కదలిక లేదు.


 తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులోకి రాగా.. ఆర్‌ఆర్‌ఆర్‌ కు చిక్కుముడులు వీడుతున్నాయి. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా తొలగించాల్సిన పైపులైన్లు, కేబుళ్లు, స్తంభాలు (యుటిలిటీస్‌) తదితరాల తరలింపు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వ్యయం దాదాపు రూ.200 కోట్లు భరించడానికి ఒప్పుకుంది. ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ అధికారులకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేసినట్లు తెలిసింది. కేంద్రం నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వంపై అదనపు భారం తప్పింది. ఈ వ్యయాన్ని భరించే విషయంలో జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య గడచిన ఏడాదిగా చర్చలు జరుగుతున్నాయి.


హైదరాబాద్‌ ఔటర్ రింగ్‌రోడ్డు అవతల 347.84 కిలోమీటర్ల మేర రెండు భాగాలుగా ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించనున్నారు. రహదారికి అవసరమైన భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉంటుంది. రహదారి నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించాలన్నది కొన్నేళ్ల కిందటే చేసుకున్న ఒప్పందం. నిర్మాణంలో భాగంగా మార్గంలో ఉన్న తాగునీటి పైపులు, విద్యుత్తు, టెలికం కేబుళ్లు, విద్యుత్తు స్తంభాలు వంటివాటిని తరలించాల్సి ఉంటుంది. వీటి తరలింపు కోసం దాదాపు రూ.200 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారుల అంచనా. అయితే ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని జాతీయ రహదారుల సంస్థ గతంలో లేఖ రాసింది.


అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తర్జనభర్జనల తర్వాత అదనపు వ్యయం భరించేది లేదని స్పష్టంచేసింది. ఆ వ్యయాన్ని భరించని పక్షంలో ప్రాజెక్టు ముందుకు వెళ్లడం కష్టం అంటూ కేంద్ర సంస్థ మరో లేఖ రాయడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర అధికార పగ్గాలు కాంగ్రెస్‌ పార్టీ చేతికి వచ్చిన నేపథ్యంలో పైపులైన్లు తదితరాల తరలింపు వ్యయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్రానికి లెటర్ రాశారు. ఆయన లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ యుటిలిటీ వ్యయాన్ని కేంద్రమే భరించాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో త్వరలోనే రీజినల్ రింగు రోడ్డు పనులు వేగవంతం కానుంది.



Latest News
 

నేడు జిల్లాకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి Wed, Apr 23, 2025, 10:53 AM
రైతులను దళారులను నమ్మవద్జు Wed, Apr 23, 2025, 10:30 AM
BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు Tue, Apr 22, 2025, 09:08 PM
మే 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి Tue, Apr 22, 2025, 08:51 PM
ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి చట్టం: ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 08:50 PM