byసూర్య | Tue, Dec 05, 2023, 11:29 AM
తెలంగాణలో సీపీఐతో కలిసి కాంగ్రెస్ 65 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అయితే సీఎం ఎంపికలో ఊహించని ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. సీఎంను ఎంపిక చేసే బాధ్యత అధిష్టానానికి అప్పగిస్తూ సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు సోమవారం తీర్మానం చేశారు. మంగళవారం దీనిపై ప్రకటన వచ్చే తరుణంలో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ ఢిల్లీ వెళ్లారు. సీఎం పదవికి తమ పేర్లను కూడా పరిశీలించాలని అధిష్టానాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ సీఎం అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుండగా.. ఈ విషయంపై ఏఐసీసీ AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. 'సాయంత్రంలోపు సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తాం. ఇవాళే సీఎం పేరును ప్రకటిస్తాం' అని వెల్లడించారు. కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్న పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్, భట్టి.. మధ్యాహ్నం ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత సీఎం అభ్యర్థిపై క్లారిటీ రానుంది.
మరోవైపు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ఖర్గేతో డీకేఎస్ భేటీకి ముందు భట్టి, ఉత్తమ్లు డీకేఎస్తో సమావేశమై సీఎం, మంత్రివర్గ కూర్పుపై తమ వాదనలు బలంగా వినిపించనున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్కుమార్రెడ్డి తన ఎంపీ పదవికి ఇవాళే రాజీనామా చేయనున్నట్లు సమాచారం.