![]() |
![]() |
byసూర్య | Sat, Dec 02, 2023, 09:41 PM
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే సంస్థ శుభవార్త వినిపించింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం సేవలు కొనసాగిస్తోన్న 22 ప్రత్యేక రైళ్ల సర్వీసులను అధికారులు మళ్లీ పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రత్యేక రైళ్లలో.. సికింద్రాబాద్- దర్బంగ్, సికింద్రాబాద్- ధనపూర్, హైదరాబాద్- గోరఖ్పూర్, నాగర్సోల్- కాచిగూడ, మధురై- కాచిగూడ సర్వీసులు కూడా ఉన్నాయి. ఈ నెల 4 నుంచి ఫిబ్రవరి 2 వరకు షెడ్యూల్ వారీగా ఈ స్పెషల్ ట్రైన్స్ రాకపోకలు సాగించనున్నాయని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు.. తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కూడా అధికారులు మంచి వార్త వినిపించారు. తిరుపతి సహా పలు పట్టణాలకు నడుస్తున్న ప్రత్యేక రైళ్లను కూడా డిసెంబర్ ఆఖరి వారం వరకు పొడిగించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 10 ప్రత్యేక రైళ్లు నడుపుతుండగా.. వాటిని పొడిగిస్తూ నిర్ణం తీసుకున్నారు. సికింద్రాబాద్- తిరుపతి రైలు.. డిసెంబరు 25వ తేదీ వరకు ప్రతి సోమవారం, తిరుపతి- సికింద్రాబాద్ రైలు డిసెంబరు 31 వరకు ప్రతి ఆదివారం సేవలందించనుంది.
ఇక హైదరాబాద్- నర్సాపూర్ రైలు.. డిసెంబరు 30 వరకు ప్రతి శనివారం, నర్సాపూర్- హైదరాబాద్ రైలు డిసెంబరు 31 వరకు ప్రతి ఆదివారం సేవలందిస్తుంది. కాకినాడ-లింగంపల్లి ట్రైన్ కూడా డిసెంబరు 29 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో... లింగంపల్లి- కాకినాడ ట్రైన్ డిసెంబరు 30 తేదీ వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో నడవనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. దక్షిణ మధ్య రైల్వే సంస్థను పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్ అవార్డులు వరించాయి. సంస్థలోని సివిల్ ఇంజినీరింగ్ విభాగంతో పాటు నిర్మాణానికి సంబంధించిన మరో రెండు విభాగాలకు పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్- 2023 అవార్డులు వచ్చాయి. ఈ షీల్డ్ అవార్డును ఈ నెల 15న ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నిర్వహించనున్న కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ఎస్సీఆర్ జీఎం అరుణ్కుమార్ జైన్ అందుకోనున్నారు.