byసూర్య | Sat, Dec 02, 2023, 10:57 AM
నవంబర్ 30న పాత మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియడంతో ఆగస్టులోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త లైసెన్స్ లకు నోటిఫికేషన్ జారీ చేసింది. రెండేండ్ల కాలానికి టెండర్లు ఆహ్వానించగా.. 2,620 వైన్స్కు లక్షా 31 వేల 490 దరఖాస్తులు వచ్చాయి. టెండర్ల అప్లికేషన్ ఫీజు రూపంలోనే సర్కారుకు ఏకంగా రూ.2,629 కోట్లు సమకూరాయి. షాపులు దక్కిన యజమానులు శుక్రవారం కొత్త వైన్స్ ను ప్రారంభించారు.
రాష్ట్రంలో గతేడు 2,216 లిక్కర్షాపులు ఉండగా.. సర్కారు ఈసారి కొత్తగా 404 షాపులు ఏర్పాటు చేసింది. దీంతో ఈ సంఖ్య 2,620కి చేరింది. మరో 1,200 బార్లు ఉన్నాయి. కొత్త షాపుల లైసెన్స్గడువు రెండేండ్ల పాటు (2025, నవంబర్30 వరకు) ఉంటుంది. బీఆర్ఎస్ప్రభుత్వం వైన్ షాపులకు రిజర్వేషన్లను అమలు చేస్తోంది. దీంతో ఈసారి గౌడ కులస్తులకు 393 షాపులు, ఎస్సీలకు 262 షాపులు, ఎస్టీలకు 95 షాపులు దక్కాయి. బీఆర్ఎస్ సర్కారుకు లిక్కర్ ఆదాయమే ప్రధాన వనరుగా మారింది. గడిచిన తొమ్మిదేండ్లలో మద్యం రూపంలో ప్రజల నుంచి రూ.2 లక్షల కోట్ల ఆదాయాన్ని పిండుకున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. ఆదాయంలో ఏ ఏటికాయేడు రికార్డులు బ్రేక్అవుతున్నాయి. నిజానికి తెలంగాణ వచ్చిన కొత్తలో 2014--15లో లిక్కర్ ఇన్కం రూ.10,880 కోట్లు ఉంటే, 2018--19 నాటికి రూ.20,850 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత 2021--22లో రూ.34 వేల కోట్లకు, ఈ ఏడాది రూ.36 వేల కోట్ల దరిదాపుల్లోకి చేరింది. వచ్చే రెండేండ్లలో రూ.80 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు.. ఆమేరకు షాపుల సంఖ్యనూ పెంచింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ తొమ్మిదేండ్లు లిక్కర్ వ్యాపారానికి స్వర్ణయుగంలా మారింది. లిక్కర్ ఆదాయం పెంపే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో బెల్టు షాపులకు అనుమతులిచ్చింది. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా.. పదికి తక్కువ కాకుండా బెల్ట్ షాపులు ఉన్నాయి. కార్పొరేషన్లు, పట్టణాలు, మండల కేంద్రాల్లోనూ వాడవాడలా బెల్టు షాపులు, వైన్స్ల దగ్గర్లో సిట్టింగ్ రూంలు దర్శనమిస్తాయి. బెల్టు షాపులకు అడ్డుకట్ట వేయాల్సిన ఆబ్కారీ శాఖ దగ్గరుండి ప్రోత్సహిస్తూ వచ్చింది.ప్రభుత్వ ఆదేశాలే ఇందుకు కారణమనే అభిప్రాయలున్నాయి. దీంతో లిక్కర్ వ్యాపారులకు లాభాల పంట పండుతోంది. అందుకే గత ఆగస్టులో మద్యం లైసెన్స్ల కోసం ప్రభుత్వం టెండర్లు పిలవగా.. దక్కించుకునేందుకు లక్షల మంది పోటీపడ్డారు. అయితే, తాము అధికారంలోకి వస్తే గ్రామాల్లోని బెల్టు షాపులన్నీ తొలగిస్తామని ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాజాగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. దీంతో లిక్కర్ వ్యాపారుల్లో టెన్షన్ మొదలైంది. ఒకవేళ బెల్టు షాపులు తొలగిస్తే తమ వ్యాపారాలు దెబ్బతినడం ఖాయమని మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి గ్రామాల్లో బెల్ట్ షాపులు తొలగిస్తే అదే పదివేలని మహిళాలు భావిస్తోంది.