byసూర్య | Fri, Dec 01, 2023, 05:25 PM
రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 55 నుంచి 60 సీట్లు, కాంగ్రెస్ 40 నుంచి 50 సీట్లలో గెలవొచ్చని క్యూ మెగా ప్రీ పోల్ సర్వే, ఒపీనియన్ పోల్ వెల్లడించింది. ఈ యేడాది మే 25 నుంచి నవంబర్ 25 వరకు రాష్ట్రంలో 10,22,500 మందితో చేసిన సర్వేతో పాటు ఒపీనియన్ పోల్ను క్రోడీకరించి వేసిన అంచనాలను క్యూ మెగా సర్వే వ్యవస్థాపక సీఈవో ఖాదర్ ఖాన్ పఠాన్ వెల్లడించారు. తాము చేసిన సర్వేలో అన్ని వయస్సులు, కులాలు, విద్యావంతులు, నిరక్షరాస్యులు, వివిధ వృత్తులు చేసుకునే వారు, పురుషులు, మహిళలు తదితరులున్నారని తెలిపారు. గురువారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీకి 2 నుంచి 5, ఎంఐఎంకు 5 నుంచి 7, ఇతరులకు ఒక సీటు రావొచ్చని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వచ్చే సీట్లలో ఐదు సీట్లు పెరగడం లేదా తగ్గడం జరగొచ్చన్నారు. 17 స్థానాల్లో తీవ్రమైన పోటీ నెలకొందని వాటి ఫలితాలు మారే అవకాశముందని తెలిపారు. ఓట్ల శాతం పరంగా బీఆర్ఎస్కు 43 శాతం, కాంగ్రెస్కు 40 శాతం, బీజేపీకి 5 శాతం, బీయస్పీకి 0.7 శాతం, సీపీఐ, సీపీఐ (ఎం)లకు 1.3 శాతం, ఎంఐఎంకు 4 శాతం, ఇతరులకు ఆరు శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు.
కాంగ్రెస్ గట్టి పోటీని ఎదుర్కొంటున్న నియోజకవర్గాలివే…
చెన్నూరు, మంచిర్యాల, జగిత్యాల, ధర్మపురి, మానకొండూరు, మెదక్, ఉప్పల్, ఎల్.బీ.నగర్, అంబర్పేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్, గద్వాల, కొల్లపూర్, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్, సూర్యాపేట, మహబూబాబాద్, వైరా, పినపాక, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశమున్నా…. అక్కడ గట్టి పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో ఫలితాలు మారే అవకాశముందని తెలిపారు.
బీఆర్ఎస్ గట్టిపోటీని ఎదుర్కొంటున్న నియోజకవర్గాలివే…
ఆదిలాబాద్, వేములవాడ, కుత్బుల్లాపూర్, నర్సంపేట్, ఖమ్మం, , సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలున్నా గట్టిపోటీని ఎదుర్కొంటున్నది.
ఎంఐఎంను ఇబ్బంది పెడుతున్న నాంపల్లి
నాంపల్లి నియోజకవర్గంలో ఎంఐఎం గెలుపు సాధించే దిశగా ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నది.
గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్దే గెలుపు
గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల్లో సీఎం కేసీఆర్ గెలుస్తారని ఖాదర్ ఖాన్ తేల్చారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి, హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గెలుపు ఖాయమన్నారు.
గట్టిపోటీ ఎదుర్కొంటున్న మంత్రులు వీరే..
సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో కొందరి గెలుపు నల్లేరు మీద నడకలా ఉండనుండగా, మరి కొంత మంది సమీప ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. గట్టిపోటీ ఎదుర్కొంటున్న మంత్రుల్లో పువ్వాడ అజయ్ (ఖమ్మం), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), జగదీశ్వర్ రెడ్డి (సూర్యాపేట) ఉన్నారు.