![]() |
![]() |
byసూర్య | Mon, Nov 20, 2023, 10:20 PM
ప్రస్తుతం ఉన్న కాలంలో ఇంట్లో చేసుకునే వంట కంటే.. హోటల్లో తినే తిండే ఎక్కువైపోయింది. వంట చేసుకునేందుకు సమయం లేకనో.. హోటళ్లో తినటమంటే అదో గౌరవంగా భావించటమో.. లేదా వ్యసనంగా మారటమో కానీ.. చాలా మంది ఇంట్లో తినటం కంటే.. హోటళ్లలోనే ఎక్కువగా తింటూ కడుపు నింపుకుంటున్నారు. ఎక్కడ తింటే ఏముంది.. ఆకలి తీరితే చాలు అంటారా.. అది కూడా నిజమే. అయితే.. ఆకలి తీర్చుకునే క్రమంలో కొంత మంది ఆస్పత్రులపాలు అవుతున్నారు. హోటళ్లలో మన ముందు ప్లేట్లలో పెట్టే వంటకాలను చూంస్తుంటేనే నోరూరిపోతుంది. అయితే.. అవి చేసే విధానం, అక్కడ పాటించే శుభ్రత, వాడే పదార్థాల నాణ్యతలాంటి విషయాల్లో కొంచెం అటూఇటూ అయితే మాత్రం.. ఇంకేముంది హోటల్లో బిల్లు కట్టిన అదే చేత్తో.. హాస్పిటల్లోనూ బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే.. అచ్చంగా అదే పరిస్థితి వచ్చింది హైదరాబాద్లో.
ఓ హోటల్లో మండీ బిర్యాని తిన్న 45 మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఈ ఘటన నవంబర్ 19న హైదరాబాద్లో చోటుచేసుకుంది. నగరంలోని ఓ మండి హోటల్లో తిన్న వాళ్లతో పాటు పార్శిల్ తీసుకున్న వాళ్లందరూ కలిపి మొత్తం 45 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాల వంటి ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి ఫిర్యాదు చేశారు. క్షతగాత్రులు హైదరాబాద్లోని వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు. ఈ ఘటనపై స్థానిక సామాజిక కార్యకర్త అజ్మత్ జాఫరీ.. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు వచ్చిన వెంటనే.. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ను పరిశీలించారు. మయోనైస్, మండీ బియ్యం కలుషితమయ్యే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆహార పదార్థాల నమూనాలను విశ్లేషణకు పంపినట్టు తెలిపారు. తదుపరి నోటీసు వచ్చేవరకు హోటల్ను మూసివేయాలని యాజమాన్యానికి అధికారులు సూచించారు. హోటల్లోని కిచెన్లో పరిశుభ్రత పాటించనందుకు.. ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినందుకు గానూ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హోటల్పై బాధితుల్లో ఒకరు మీర్చౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.