byసూర్య | Mon, Nov 20, 2023, 10:15 PM
నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్పై నిర్మించిన బేతవోలు వరద కాలువకు ఉన్న ఎస్కేప్ షట్టర్ ఊడిపోయింది. సూర్యాపేట జిల్లా మునగాల మండల హెడ్క్వార్టర్ శివారులో ఆదివారం ఈ ఘటన జరిగింది. షట్టర్ ఊడిపోవటంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. దిగువ ప్రాంతాలకు సాగర్ ఎడమ కాల్వ నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో చిలుకూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లో వందల ఎకరాల పంట నీట మునిగింది. ఇప్పటికే కోతలు కోసి పొలాల్లోనే ఉంచిన పంటలు తడిసి ముద్దయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సీఈ రమేష్ బాబు, ఎస్ ఈ నరసింహరాజు కాలువను పరిశీలించారు. నీటి సరఫరాను నిలిపివేశారు. అయితే ఈ లోపే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నీటమునగడంతో రైతులు ఆవేదన వక్యం చేశారు. తమక న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. బేతవోలు చెరువు నింపేందుకు జేసీబీతో షట్టర్ తెరిచినట్లు పోలేనిగూడెం రైతులు ఆరోపిస్తున్నారు. అది కావాలనే చేశారని.. షెట్టర్ తెరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.