byసూర్య | Mon, Sep 25, 2023, 07:22 PM
ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక సమావేశానికి ఆహ్వానం అందింది. వ్యవసాయరంగంలో ప్రపంచ ప్రగతి చర్చకు వేదికగా 'బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్' సదస్సుకు పేరు. అక్టోబర్ 24 నుంచి 26 వరకు అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో ఉన్న డెస్మోయిన్లో ఈ సదస్సు జరగనుండగా.. ఐటీ కేటీఆర్కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఆయనతో పాటు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది.
సదస్సులో పాల్గొని తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానాన్ని వివరించాలని సదస్సు నిర్వాహకులు కేటీఆర్ను ఆహ్వానించారు. ఈ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి 1200 మంది వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్ సమావేశంలో ఈసారి ఆహార నాణ్యత, పరిమాణాన్ని పెంచడంతోపాటు అందరికీ ఆహార లభ్యత అనే అంశాలపై చర్చించనున్నారు. తనను ఈ సదస్సుకు ఆహ్వానించటం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగ ప్రగతిని గుర్తించి ఈ అంశంపై ప్రసంగించాల్సిందిగా వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఫౌండేషన్ ఆహ్వానం పంపినట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయరంగం సాధించిన అపూర్వ విజయగాథను ప్రదర్శించేందుకు ఇదొక గొప్ప వేదిక అవుతుందన్నారు. ఆహార భద్రతలో దేశానికి తెలంగాణ రాష్ట్రం భరోసాగా నిలుస్తున్నదని చెప్పారు. ఇంతటి విజయవంతమైన తెలంగాణ వ్యవసాయ నమూనాను అంతర్జాతీయ వేదికపై వివరించాలని వచ్చిన ఆహ్వానం తెలంగాణ రాష్ట్ర విధానాలకు దకిన గౌరవంగా భావిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.